English | Telugu
ఆ విషయంలో ఎన్టీఆర్తో విభేదించిన చంద్రమోహన్.. అదే దారిలో శోభన్బాబు!
Updated : May 22, 2025
(మే 23 చంద్రమోహన్ జయంతి సందర్భంగా..)
ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఒక దశలో తెలుగు సినిమాను శాసించారు. ఒకర్ని మించి ఒకరు అద్భుతమైన సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమ కళకళలాడేలా చేశారు. ఆ తర్వాతి తరంలో కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ వంటి హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చంద్రమోహన్ విషయానికి వస్తే.. తన 50 సంవత్సరాల కెరీర్లో 900కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. వాటిలో హీరోగా చేసిన సినిమాలు 200 వరకు ఉంటాయి. 1966లో వచ్చిన రంగుల రాట్నం చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చంద్రమోహన్.. హీరోగా అయితేనే సినిమా చేస్తాను అనే సిద్ధాంతం పెట్టుకోలేదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే చెప్పేవారు. అలా అందరు హీరోల సినిమాల్లో నటించడం ద్వారా వారికి బాగా దగ్గరయ్యారు. అయితే హీరోల్లో శోభన్బాబు.. చంద్రమోహన్కు అత్యంత ఆప్తుడు. ఇద్దరి మధ్య ‘ఒరేయ్..’ అని పిలుచుకునేంత స్నేహం ఉంది. శోభన్బాబు ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు చంద్రమోహన్ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకొని కొనేవారు. అలా అతని దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే తనకు కలిసి వస్తుందని శోభన్బాబు నమ్మేవారు. ఇదిలా ఉంటే.. ఇద్దరూ ఒక విషయంలో ఎన్టీఆర్తో విభేదించారు. అందరూ ఎంతో గౌరవించే ఎన్టీఆర్ మాటను కాదనడానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్కి తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తనతో సినిమాలు చెయ్యాలంటే హైదరాబాద్లోనే చెయ్యాలి అని నిర్మాతలకు కండీషన్ పెట్టారు. అలా మొదట హైదరాబాద్ వచ్చినవారు అక్కినేని. ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ మంచి స్నేహితులే కాకుండా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవారు. ఎఎన్నార్ తర్వాత ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. తను మాత్రమే కాదు, మిగతా హీరోలు, నటీనటుల్ని కూడా తనతో పాటు వచ్చెయ్యమని చెప్పారు. అప్పటికి ఉన్న హీరోలంతా ఎన్టీఆర్ మాటను గౌరవించి హైదరాబాద్ వచ్చేశారు. కానీ, చంద్రమోహన్ మాత్రం తాను రానని చెప్పారు. మీలాంటి సీనియర్ నటులు హైదరాబాద్ షిఫ్ట్ అయితే మిగతా వారు కూడా వస్తారని నచ్చజెప్పారు. కానీ, చంద్రమోహన్ వినలేదు. హైదరాబాద్లో షూటింగ్స్ జరుగుతుంటే.. మీరు మద్రాస్లోనే ఉండిపోతే అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్పారు ఎన్టీఆర్. అవకాశాలు తగ్గినా ఫర్వాలేదు తాను మద్రాస్లోనే ఉంటానని భీష్మించుకొని కూర్చున్నారు చంద్రమోహన్. ఇదే విషయాన్ని శోభన్బాబుతో చెప్పి అతన్ని కూడా హైదరాబాద్ వెళ్లొద్దని సలహా ఇచ్చారు. ఒకరి వెంట ఒకరు హైదరాబాద్ వచ్చేసినా చంద్రమోహన్, శోభన్బాబు మాత్రం మద్రాస్లోనే ఉండిపోయారు.
ఎన్టీఆర్ చెప్పినట్టుగానే చంద్రమోహన్కు సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. హైదరాబాద్లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్టును మద్రాస్ నుంచి రప్పించాలంటే ఫ్లైట్ టికెట్స్, వసతి వంటివి నిర్మాతకు భారమవుతాయి. అందుకే చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు చంద్రమోహన్. ఆ సమయంలో ఆయన ఒక ఆలోచన చేసి ఒక ప్యాకేజ్లా సినిమా చెయ్యాలనుకున్నారు. ఫ్లైట్, వసతి వంటివి కూడా తన పారితోషికంలోనే కలిపి నిర్మాతకు చెప్పేవారు. హైదరాబాద్లో ఉన్న తన స్థలంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకొని షూటింగ్కి వచ్చినపుడల్లా అందులోనే ఉండేవారు. ఫ్లైట్ టికెట్స్ కూడా తనే తీసుకొని హైదరాబాద్ వచ్చేవారు. అలా నటుడిగా మళ్లీ బిజీ అయ్యారు చంద్రమోహన్. ఎవరూ చేయని కొన్ని విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్రమోహన్కి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాల్లో ఒక్కటి కూడా రాకపోవడం గమనార్హం. దీని గురించి ఎప్పుడు ప్రస్తావించినా నవ్వి ఊరుకునేవారు తప్ప తన బాధను వ్యక్తం చేసేవారు కాదు.
