Read more!

English | Telugu

ప్ర‌కాశ్‌రాజ్ మొద‌టి భార్య ఎవ‌రో తెలుసా?

 

ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌తిభావంతుడైన న‌టుడ‌న‌టంలో సందేహం లేదు. ఆయ‌న కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు, ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ సినిమాల్లో న‌టిస్తోన్న బ‌హుభాషా న‌టుడు. దేశంలోని సినిమా ప్రియుల్లో ఆయ‌న పేరు తెలీనివాళ్లు త‌క్కువ‌. ప్రియ‌ద‌ర్శ‌న్ రూపొందించిన 'కాంచీవ‌రం' చిత్రంలో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు.

స్వ‌త‌హాగా క‌న్న‌డిగుడైన ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన న‌టీన‌టుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడిగా ఎన్నిక కావాల‌నే ఆశ‌యంతో ఉన్నాడు. ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ స‌పోర్ట్ సాధించి, ప‌లువురు న‌టుల‌ను త‌నతోడు చేసుకొని త‌న‌ ప్యాన‌ల్‌ను కూడా ప్ర‌కటించాడు. గ‌డ‌చిన ఆదివారం 'మా' మెంబ‌ర్స్‌తో ఆయ‌న విందు మీటింగ్ పెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న విందు రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. యంగ్ జ‌న‌రేష‌న్‌లో చాలామందికి తెలీని విష‌యం.. ఒక‌ప్పుడు ఆయ‌న‌, శ్రీ‌హ‌రి తోడ‌ల్లుళ్లు! అవును. ప్ర‌కాశ్‌రాజ్ మొద‌టి భార్య పేరు ల‌లిత‌కుమారి. ఆమె ఎవ‌రో కాదు, రియ‌ల్ స్టార్‌ శ్రీ‌హ‌రి భార్య శాంత‌కుమారి అలియాస్ డిస్కో శాంతికి స్వ‌యానా చెల్లెలు. త‌మిళంలో ఆమె కొన్ని సినిమాల్లో న‌టించారు. అప్పుడు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో 1994లో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే కొడుకు సిద్ధు నాలుగేళ్ల వ‌య‌సులో గాలిప‌టం ఎగ‌రేస్తూ, ప్ర‌మాద‌వ‌శాత్తూ ఒక టేబుల్ మీద నుంచి ప‌డి తీవ్ర గాయాల‌కు గురై, కొన్ని రోజుల త‌ర్వాత మ‌ర‌ణించాడు. అత‌డి మృతి త‌ర్వాత దంప‌తుల మ‌ధ్య క‌ల‌త‌లు చెల‌రేగాయి. అవి తీవ్ర‌రూపం దాల్చి, విడాకులు తీసుకొనేదాకా వెళ్లాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని శ్రీ‌హ‌రి, శాంతి దంప‌తులు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. కానీ విడిపోవ‌డానికే ప్ర‌కాశ్‌రాజ్ మొగ్గుచూపాడు. దాంతో ల‌లిత‌కుమారి కూడా విడాకుల‌కు అంగీక‌రించారు. అలా 2009లో వారికి విడాకులు మంజూర‌య్యాయి. 

అప్ప‌టికే బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ పోనీ వ‌ర్మ‌తో ప్ర‌కాశ్‌రాజ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం, ప్రేమ‌గా మారింది. ల‌లిత‌కుమారికి విడాకులు ఇచ్చిన త‌ర్వాత సంవ‌త్స‌ర‌మే.. 2010లో పోనీవ‌ర్మ‌ను రెండో వివాహం చేసుకున్నాడు ప్ర‌కాశ్‌రాజ్‌. ల‌లిత‌కుమారి ఇద్ద‌రు కుమార్తెలను కూడా పోనీవ‌ర్మ ఆద‌ర‌ణ‌గా చూసుకుంటార‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. పోనీవ‌ర్మ‌, ప్రకాశ్‌రాజ్ దంప‌తుల‌కు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.