English | Telugu
చిరంజీవి మరీ బిగ్ స్టార్ అవడం వల్లే 'అందరివాడు' కథ నచ్చలేదని చెప్పలేకపోయా!
Updated : Nov 3, 2021
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'అందరివాడు' (2005) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రీతిలో విజయం సాధించలేక కొందరివాడు అనిపించుకుంది. ఆ మూవీలో తండ్రీ కొడుకులుగా చిరంజీవి డ్యూయల్ రోల్ చేశారు. ఆ కథ నచ్చి శ్రీను వైట్లకు డైరెక్షన్ చాన్స్ ఇచ్చారాయన. కానీ శ్రీనుకు మాత్రం ఆ కథ నచ్చలేదు. చిరంజీవిని డైరెక్ట్ చేసే చాన్స్ వస్తే, తనకు నచ్చిన కథతో సినిమా తియ్యాలని ఆయన అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కథ నచ్చకుండానే 'అందరివాడు' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆయన చాలా బిగ్ స్టార్ కావడం వల్లే ఆ కథ బాగాలేదని చెప్పలేకపోయాడు. ఈ విషయాన్ని 'ఆలీతో సరదాగా' షోలో బయటపెట్టాడు శ్రీను వైట్ల.
"అందరివాడు అంత సక్సెస్ కాకపోవడానికి కారణమేంటి?" అని అలీ ప్రశించారు. "కథ రెడీగా ఉంది, డైరెక్ట్ చెయ్యమని అంటే నేను సూట్కాను. ఆ కథ నాది కాదు." అని చెప్పాడు శ్రీను. "సార్.. నేను మీ కోసం ఒక కథ తయారుచేసుకున్నాను, ఇది పక్కనపెట్టి, నా కథ ఒకసారి వినండి అని చెప్పే సందర్భం రాలేదా?" అని అడిగారు అలీ. "అదెలా చెప్పాలంటే.. ఆయన టూ బిగ్ అవడమే ప్రాబ్లెమ్" అని తేల్చి చెప్పాడు శ్రీను.
దాన్ని బట్టి అందరివాడు కథ నచ్చకుండానే ఆ మూవీని శ్రీను డైరెక్ట్ చెయ్యాల్సివచ్చిందని అర్థమవుతోంది. చిరంజీవికి నచ్చిన కథ తనకు నచ్చలేదని చెప్పే గట్స్ అప్పుడు శ్రీనుకు లేవని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి శ్రీను వైట్ల ఇంకేమైనా విషయాలు చెప్పాడేమో చూడాలి. ఈ ఆలీతో సరదాగా ఎపిసోడ్ నవంబర్ 8న ఈటీవీలో ప్రసారం కానున్నది.