Read more!

English | Telugu

ఆమిర్ ఖాన్ దెబ్బ.. 'ఆదిపురుష్' వాయిదా!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. ఇప్పటికే ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' మూవీ పలుసార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అలాగే 'సలార్' కూడా ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ కి రావడంలేదు. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ మరో మూవీ 'ఆదిపురుష్' కూడా వాయిదా పడింది.

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా 'ఆదిపురుష్‌'. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఓం రౌత్‌ దర్శకుడు. ఈ మూవీని ఆగష్టు 11, 2022న భారీగా విడుదల చేయనున్నట్లు గతంలో మూవీ టీమ్ ప్రకటించింది. అయితే ఊహించని విధంగా 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా కోసం ఆ తేదీని త్యాగం చేసింది ఆదిపురుష్‌ టీమ్.

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ , నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'లాల్‌ సింగ్‌ చద్దా'. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ సమయానికి సినిమా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఆగష్టు 11 కి వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకొని తమ కోసం విడుదల తేదీని త్యాగం చేసిన ఆదిపురుష్ మూవీ టీమ్ కి కృతఙ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే, ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన 'లాల్‌ సింగ్‌ చద్దా' వాయిదా పడటంతో షాహిద్ కపూర్ నటించిన 'జెర్సీ' మూవీ ఆ తేదీన విడుదలకు సిద్ధమైంది. 'జెర్సీ' సినిమాని ఏప్రిల్ 14న విడుదల విడుదల చేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది.