Read more!

English | Telugu

23 ఏళ్ల త‌ర్వాత స్టార్ హీరోతో ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌!

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాయ్‌కు క్రేజ్ తీసుకొచ్చిన చిత్రం సౌత్ సినిమానే. 'జీన్స్' సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత ఆమె బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైంది. అప్పుడ‌ప్పుడు మ‌ణిర‌త్నం, శంక‌ర్ వంటి ద‌ర్శ‌కుల సినిమాల్లోనూ న‌టిస్తుంది. గ‌త ఏడాది విడుద‌లైన 'పొన్నియిన్ సెల్వ‌న్' పార్ట్ 1లో ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మ‌రో త‌మిళ స్టార్ హీరో ప‌క్క‌న న‌టించ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌నే వార్త‌లు కోలీవుడ్ మీడియా వ‌ర్గాల్లో గుప్పుమంటున్నాయి. ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. అజిత్ కుమార్‌.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ చేయ‌బోతున్న ఈ సినిమాకు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. AK 62 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రైతే బావుంటుంద‌ని మేక‌ర్స్ చాలానే ఆలోచించారు. త్రిష‌, న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ వంటి పేర్లు గ‌ట్టిగానే వినిపించాయి. అయితే అజిత్‌తో ఐశ్వ‌ర్యా రాయ్ అయితే లుక్ కొత్త‌గా ఉంటుంద‌ని భావించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. ఆమె ఓకే చెబితే మాత్రం 23 ఏళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేసిన‌ట్లు అవుతుంది.

23 ఏళ్ల ముందు 'ప్రియురాలు పిలిచింది' చిత్రంలో అజిత్ కుమార్‌, ఐశ్వ‌ర్యా రాయ్ న‌టించారు. అయితే జోడీగా కాదులెండి. అయితే ఇన్నేళ్ల త‌ర్వాత మాత్రం జోడీగానే క‌నిపిస్తార‌నేది స‌మాచారం. AK 62 చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్ర‌క‌టించింది.