సెల్ఫోన్ చోరీ.. బ్యాంకు ఖాతాలు ఖాళీ..!
హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక..! సెల్ఫోన్లు చోరీ చేసి.. వాటి స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్లను తెలుసుకుని ఓటీపీల సాయంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిని ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికేహైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ వినియోగించే వ్యక్తులను ముందుగా గమనించి, వారు స్క్రీన్ లాక్ పిన్ లేదా ప్యాటర్న్ ఎలా వేస్తున్నారో నిందితులు తెలుసుకుంటున్నారు. అనంతరం అదును చూసి ఫోన్ను చోరీ చేస్తున్నారు. ఫోన్ లాక్ అయి ఉంటే బాధితుడికి కాల్ చేసి తాము బస్సు కండక్టర్ లేదా డ్రైవర్నని, ఫోన్ దొరికిందని నమ్మించి పాస్వర్డ్ చెప్పించుకుంటున్నారు. ఫోన్ అన్లాక్ అయిన తర్వాత గ్యాలరీ, నోట్స్, మెసేజ్లు, వాట్సాప్లోని వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరిస్తున్నారు. చోరీ చేసిన సిమ్ ద్వారా ఓటీపీలను పొంది యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ ఖాతాలను యాక్సెస్ చేసి నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గేమింగ్ ప్లాట్ఫారమ్లు, డిజిటల్ వాలెట్లు, మ్యూల్ ఖాతాల ద్వారా నగదును మళ్లించి చివరకు డ్రా చేసుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాలు బాధితులను గుర్తించడం, ఫోన్లు చోరీ చేయడం, పాస్వర్డ్లు రాబట్టడం, నగదు బదిలీ చేయడం వంటి పనులను వేర్వేరు వ్యక్తులతో చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ పోయినప్పుడు ఎవరైనా తిరిగి ఇస్తామని చెప్పినా స్క్రీన్ లాక్ పిన్, పాస్వర్డ్, బ్యాంకింగ్ ఓటీపీలు చెప్పకూడదని సీపీ సూచించారు. ఏటీఎం, డెబిట్ కార్డు ఫొటోలు, సీవీవీ, బ్యాంకింగ్ పాస్వర్డ్లు, ఆధార్, పాన్ వివరాలను ఫోన్లో భద్రపరచకూడదన్నారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ను బ్లాక్ చేయించి, బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి. CEIR పోర్టల్ ద్వారా ఫోన్ను బ్లాక్ చేయించాలి. ఖాతా నుంచి నగదు పోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కు కాల్ చేసి, సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సీపీ వీసీ సజ్జనర్ సూచించారు. Hybrid Cyber Fraud, CP V.C. Sajjanar, Hyderabad police, CEIR Portal, Cybercrime, DGP C.V. Anand, CM Revanth reddy
Published on: Wed Aug 26, 2026 6:46PM