TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్..!

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు వృద్ధుడైన సాయన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం నేపథ్యంలో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం ప్రాంతంలో ఉన్న ఓ ఆలయానికి బయట నుంచి తాళం వేసి లోపల ఒక వృద్ధుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి వెంటనే అతని పట్టుకున్నారు. ఆ వృద్ధుడు ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియోగా రికార్డు చేశారు. ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న @ సాయిలు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో స్థానికులు వెంటనే అతని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సాయన్న ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈకేసులో వృద్ధుడు సాయన్న, రవి అనే ఇద్దరు నిందితులకు మైనర్ బాలికతో గతంలోనే పరిచయం ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 13 ఫిబ్రవరి 2025న బాలికను యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన ఘటనకు సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై క్రైమ్ నంబర్ 505/2026*లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు **POCSO Act-2012, **SC/ST (POA) Amendment Act-2015* కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బిల్లె రవి(46)ని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.మైనర్ బాలికకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. Sexual assault on a minor girl, POCSO Act, BNS, Cyberabad Police, Sayanna, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy

Published on: Wed Aug 26, 2026 9:54PM

political-news-img

సెల్‌ఫోన్‌ చోరీ.. బ్యాంకు ఖాతాలు ఖాళీ..!

హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..! సెల్‌ఫోన్లు చోరీ చేసి.. వాటి స్క్రీన్‌ లాక్‌ పిన్‌, పాస్‌వర్డ్‌లను తెలుసుకుని ఓటీపీల సాయంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ‘హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌’ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిని ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికేహైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి, ఐదు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగించే వ్యక్తులను ముందుగా గమనించి, వారు స్క్రీన్‌ లాక్‌ పిన్‌ లేదా ప్యాటర్న్‌ ఎలా వేస్తున్నారో నిందితులు తెలుసుకుంటున్నారు. అనంతరం అదును చూసి ఫోన్‌ను చోరీ చేస్తున్నారు. ఫోన్‌ లాక్‌ అయి ఉంటే బాధితుడికి కాల్‌ చేసి తాము బస్సు కండక్టర్‌ లేదా డ్రైవర్‌నని, ఫోన్‌ దొరికిందని నమ్మించి పాస్‌వర్డ్‌ చెప్పించుకుంటున్నారు. ఫోన్‌ అన్‌లాక్‌ అయిన తర్వాత గ్యాలరీ, నోట్స్‌, మెసేజ్‌లు, వాట్సాప్‌లోని వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను సేకరిస్తున్నారు. చోరీ చేసిన సిమ్‌ ద్వారా ఓటీపీలను పొంది యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాలను యాక్సెస్‌ చేసి నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్‌ వాలెట్లు, మ్యూల్‌ ఖాతాల ద్వారా నగదును మళ్లించి చివరకు డ్రా చేసుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాలు బాధితులను గుర్తించడం, ఫోన్లు చోరీ చేయడం, పాస్‌వర్డ్‌లు రాబట్టడం, నగదు బదిలీ చేయడం వంటి పనులను వేర్వేరు వ్యక్తులతో చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ పోయినప్పుడు ఎవరైనా తిరిగి ఇస్తామని చెప్పినా స్క్రీన్‌ లాక్‌ పిన్‌, పాస్‌వర్డ్‌, బ్యాంకింగ్‌ ఓటీపీలు చెప్పకూడదని సీపీ సూచించారు. ఏటీఎం, డెబిట్‌ కార్డు ఫొటోలు, సీవీవీ, బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లు, ఆధార్‌, పాన్‌ వివరాలను ఫోన్‌లో భద్రపరచకూడదన్నారు. ఫోన్‌ పోయిన వెంటనే సిమ్‌ను బ్లాక్‌ చేయించి, బ్యాంకింగ్‌, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి. CEIR పోర్టల్‌ ద్వారా ఫోన్‌ను బ్లాక్‌ చేయించాలి. ఖాతా నుంచి నగదు పోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కు కాల్‌ చేసి, సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ వీసీ సజ్జనర్‌ సూచించారు. Hybrid Cyber Fraud, CP V.C. Sajjanar, Hyderabad police, CEIR Portal, Cybercrime, DGP C.V. Anand, CM Revanth reddy

Published on: Wed Aug 26, 2026 6:46PM

political-news-img

వధువు మెడలో మూడు ముళ్లు.. వేసిన కల్వకుంట్ల కవిత..!

పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు. కానీ ఈ వివాహ వేడుకలో మాత్రం ఓ ఆసక్తికరమైన సంప్రదాయం అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు బాషబోయిన బాలప్రసాద్‌ పెళ్లిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆడబిడ్డగా మారి ప్రత్యేక వివాహ తంతును నిర్వహించారు. ఈసీఐఎల్‌–కీసర క్రాస్‌రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్‌లో బుధవారం బాలప్ర సాద్‌–శివాని వివాహం జరిగింది. బాలప్రసాద్‌కు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో.. తన వివాహంలో ఆడబిడ్డగా ఉండాలని ఆయన కవితను కోరినట్లు సమాచారం. ఆయన కోరిక మేరకు కవిత వివాహ వేడుకలో ఆడపడుచు బాధ్యతను స్వీకరించారు. ముదిరాజ్‌ సంప్రదాయం ప్రకారం.. వరుడు మంగళసూత్రం కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముదారంతో వధువు మెడలో మూడు ముళ్లు వేయించే ఆచారం ఉంది. అందులో భాగంగా కవిత వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు. అనంతరం వధువుకు ప్రదానపు ఉంగరం తొడిగడంతో పాటు ఒడిబియ్యం పోసి ఆశీర్వదించారు. ఆ తర్వాత వరుడు బాల ప్రసాద్‌ శివాని మెడలో మంగళసూత్రం ధరింప జేశారు. కవిత ఇలా “ఇంటి ఆడబిడ్డ”గా మారి సంప్రదాయాన్ని పూర్తి చేయడం వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. Kalvakuntla Kavitha, Telangana Rakshana Sena, Bashaboyina Balaprasada Wedding, ECIL, Keesara Crossroad

Published on: Wed Aug 26, 2026 6:30PM

political-news-img

ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి..!

అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ అనే తెలుగు విద్యార్థి ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర శోకసంద్రాన్ని నింపింది. ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్న కుమారుడు దేహమై తిరిగి వస్తున్నాడనే వార్త విని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర సంఘటన ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఫ్లోరిడాలోని పామ్ బే ప్రాంతంలో జరిగింది. హైవే ఐ-95లోని 172వ మైలురాయి సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ఓ కార్ తీవ్ర నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టును అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే, ఢీకొన్న మరుక్షణమే ఆ వాహనంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కార్ పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ ఘోర ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు తెలంగాణ విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారని ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. మృతుల్లో ఒకరిని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ (నాడాపూర్) గ్రామానికి చెందిన రాహుల్‌గా గుర్తించారు. రాహుల్ తండ్రి హరిబాబు, తల్లి నాగమణి దంపతుల కుమారుడు. కాగా, ఆగస్టు 26 బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో అమెరికా నుంచి బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ చేదు వార్త సమాచారం రూపంలో అందింది. కేవలం 3 నెలల క్రితమే రాహుల్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. సుదూర తీరాలకు వెళ్లిన తమ కుమారుడు పట్టుదలతో చదివి గొప్ప ప్రయోజకుడు అవుతాడని కన్నవారు భావించారు. అయితే, విధి ఆడిన వింత నాటకంలో కేవలం 90 రోజుల వ్యవధిలోనే రాహుల్ జీవితం ముగిసిపోవడం నారాయణపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాహుల్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన మరో ఇద్దరు యువకులు కూడా తెలంగాణ ప్రాంతానికే చెందిన వారని ప్రాథమిక వర్గాలు తెలిపాయి. అమెరికా పోలీసు అధికారులు ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు, రాహుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని, అమెరికాలోని తెలుగు సంఘాలు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన యువకులు ఇలా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం విదేశాల్లోని తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. US road accident, Florida Telugu student death, Nizamabad Rahul Florida crash, Telangana students dead in US, Palm Bay Florida car accident, US Telugu news

Published on: Wed Aug 26, 2026 4:37PM

political-news-img

పెళ్లి పేరుతో మోసం.. టాలీవుడ్ దర్శకుడు పవన్ అరెస్టు.!

టాలీవుడ్‌లో మరో వివాదం సంచలనం సృష్టిస్తోంది. అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేనిపై ఒక లేడీ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పవన్ సాధినేని ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయం కొద్దిరోజుల్లోనే సన్నిహిత సంబంధంగా మారింది. తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో, ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. అయితే.. ఇటీవల తాను పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పదన్ సాధినేనిని అరెస్టు చేశారు. ప్రేమ ఇష్క్ కాదల్ , సావిత్రి, సేనాపతి, ఆకాశంలో ఒక తార వంటి సినిమాలు, దయ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా పవన్ మంచి గుర్తింపు పొందారు. దర్శకుడిగానే కాకుండా పవన్ ప్రముఖ నిర్మాతలతో కలిసి సినిమాల నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. Tollywood director arrested, Pawan sadhik, Fraud , pretext, marriage

Published on: Wed Aug 26, 2026 3:15PM

political-news-img

కొండా సురేఖపై వేటే.!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గత కొన్ని రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల పై వేటు తప్పదని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. వీరిద్దరి వ్యాఖ్యలు, వైఖరిపై విచారణ జరిపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్‌కు అందజేసింది. ఆ నివేదికలో కొండా, చిన్నారెడ్డిలపై వేటుకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ తమ నివేదికను పీసీసీ అధ్యక్షుడికి సీల్డ్ కవర్ లో సమర్పించారు. పార్టీ నియమావళి, క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలకు స్పష్టమైన, గట్టి హెచ్చరిక పంపాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో వారు పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ పార్టీ పార్టీ నియమాలు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం ఇది మూడోసారి కావడంతో ఆ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ నివేదికలో ప్రస్తావించి.. ఇక ఉపేక్షించడం కరెక్ట్ కాదని పేర్కొన్నట్లు చెబుతున్నారు. తాజా వ్యవహారంలో కూడా కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను వెంటనే ఖండించలేదని పేర్కొంటూ.. ఆమె తీరును చూసీ చూడనట్లు వదిలేస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెడతాయని నివేదిక విస్పష్టంగా పేర్కొన్నట్ల కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇక చిన్నారెడ్డి విషయంలో కూడా కమిటీ చర్యలకు సిపారసు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చాలా కాలంగా ఉంటూ, కీలక పదవులు, బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి, ఇప్పుడు కేబినెట్ హోదా ర్యాంకులో ఉండి కూడా పార్టీ అంతర్గత విషయాలను పార్టీ వేదికలపై కాకుండా బహిరంగంగా మాట్లాడటం సరికాదని క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. అదలా ఉంటే నివేదిక సమర్పించిన అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి కొండా సురేఖ, చిన్నారెడ్డి అందించిన వివరణ లేఖల ఆధారంగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ఆ ఇద్దరు నేతలూ కూడా క్రమశిక్షణ కమిటీని వ్యక్తిగతంగా కలవలేదనీ, తమ ఎక్స్ ప్లనేషన్ ను గాంధీభవన్‌లో సమర్పించారని చెప్పారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీకి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండాలంటే క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉండక తప్పదని మల్లు ఈ సందర్భంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. Konda Surekha, Chinna Reddy, TPCC Disciplinary Committee, Mallu Ravi, Mahesh Kumar Goud, Telangana Congress, eluguOne

Published on: Wed Aug 26, 2026 10:17AM

political-news-img

కంటైనర్ ను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం.!

సూర్యాపేట జిల్లాలో బుధవారం (ఆగస్టు 26) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెడుతున్న ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 42 మంది ప్రయాణీకులు ఉన్నారు. . కోదాడ సమీపంలోని దొరకుంట వద్దకు రాగానే.. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది అతికష్టం మీద బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. Kodada road accident, Suryapet bus crash, Telangana private bus accident, Hyderabad to Eluru bus accident, Kodada news today, National Highway road accident

Published on: Wed Aug 26, 2026 9:57AM

political-news-img

హైకోర్టును ఆశ్రయించిన మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్..!

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు నమోదైన అనంతరం సుమంత్ పరారయ్యాడు. హైదరాబాద్‌లోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్‌ను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమంత్ ఓ మంత్రి నివాసంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు సుమంత్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తనపై హత్యాయత్నం కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ముగ్గురు నిందితుల అరెస్టు అవ్వడం... మరోవైపు సుమంత్ కోర్టును ఆశ్రయించడం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Former OSD Sumanth, Minister Konda Surekha, Task Force Police, Telangana High Court, CM Revanth reddy, CP Sajjanar

Published on: Tue Aug 25, 2026 8:24PM

political-news-img

హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ హత్యకు కుట్ర..?

హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ రోజు ఉదయం మన్సూరాబాద్‌లో సత్యనారాయణ నిర్వహిస్తున్న రేషన్ షాప్ వద్ద నలుగురు యువకులు అనుమానాస్పదంగా గంటసేపు తిరుగుతూ కనిపించారు. యువకుల కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మరో యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకుడు తన పేరు గార్లపాటి అరవింద్ రెడ్డిగా పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా అరవింద్ రెడ్డిపోలీసుల ఎదుట కీలక విషయాలు వెల్లడించాడు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పంపించడంతోనే తాము సత్యనారాయణపై రెక్కీ నిర్వహించేందుకు వచ్చినట్లు అతను చెప్పాడు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.. ఇదిలా ఉండగా మరోవైపు గత కొంతకాలంగా బుడ్డ సత్యనారాయణకు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డితో వివాదం కొనసాగుతున్నది. ప్రభాకర్ రెడ్డిపై సత్యనారాయణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. సత్యనారాయణపై ఆగ్రహంతో ఉన్న శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలే ఈ రెక్కీ వెనుక ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు యువకులు సత్యనారాయణ రేషన్ షాప్ వద్దకు వచ్చి.. అతని కదలికలను గమనించడం, వారిలో ఒకరు పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బుడ్డ సత్యనారాయణ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనపై హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై స్పందించిన గిరిజన సంఘాల నాయకులు... జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. హత్య కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా వారు కోరారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పట్టుబడిన యువకుడి వాంగ్మూలం, రెక్కీకి వచ్చిన నలుగురు యువకుల వెనుక ఉన్న వ్యక్తులు, హత్యకు సంబంధించిన కుట్ర నిజంగా జరిగిందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Market Committee Director Budda Satyanarayana, Jakkidi Shivacharan Reddy, Jakkidi Prabhakar Reddy, Congress party, CM Revanth reddy

Published on: Tue Aug 25, 2026 8:14PM

political-news-img

దీక్ష విరమించిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు..!

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, నిమ్మరసం ఇచ్చి రాంచందర్ రావు చేత ఈ పోరాట దీక్షను ముగించేలా చేశారు. "ఫీజు బకాయి - బీజేపీ లడాయి" పేరిట హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష కొనసాగింది. రాష్ట్రంలో పేరుకుపోయిన రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వం బలంగా డిమాండ్ చేసింది. దీక్షా వేదికపై పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని తమ మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో తీవ్ర అలసత్వం వహిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని రాంచందర్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీంతో వేలాది మంది ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన బకాయిలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల బీజేపీ ఆందోళన వ్యక్తంచేసింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని నేతలు విమర్శించారు. ఈ పోరాటానికి విద్యార్థి సంఘాలు, వివిధ కాలేజీల యాజమాన్యాలు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు సైతం సంఘీభావం తెలిపారు. దీక్షా స్థలి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, యజమానులు తమ ఇబ్బందులను రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఈ దీక్షపై స్పందించిన అధికార కాంగ్రెస్ వర్గాలు, పాత బకాయిలను విడతలవారీగా తీరుస్తున్నామని, దీక్షల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ క్లిష్టమైన సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయకపోతే, భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం) ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. Fee dues BJPs fight, BJP state chief Ramchandra Rao, MP K. Lakshman, BJYM, BJP State Office Nampally, Fee Reimbursement Dues, Hyderabad Hunger Strike

Published on: Tue Aug 25, 2026 6:23PM