మిథున్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

 

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో రింగ్ మాస్టర్‌లా వ్యవహరించి అరెస్ట్ అయ్యారు.  తాజాగా ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్‌ ఫర్‌ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్‌ అధికారులు. లిక్కర్‌ స్కాం కేసులో మిథున్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా మిథున్‌రెడ్డిని పేర్కొన్నారు. 

మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్థారించారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సత్యప్రసాద్‌కు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారని సిట్‌  అధికారులు అభియోగం మోపారు. యావత్తు లిక్కర్ కుట్ర అమలుకు సత్యప్రసాద్‌ను ఉపయోగించారని తెలిపారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని, లిక్కర్‌ స్కాంలో లోతైన కుట్ర దాగి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు వివరించారు. 

ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్‌లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్‌ వ్యక్తులు, ఉన్నతాధికారులు రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అరెస్టయిన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా.. అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు సిట్‌ అధికారులు.మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో.. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని  సిట్‌ అధికారులు తెలిపారు. 

మరింత దర్యాప్తు కోసం మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్‌రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని సిట్‌ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్‌రెడ్డి సహకరించలేదని గుర్తుచేశారు. నిందితుడు మిథున్‌రెడ్డి కస్టోడియల్‌ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ, కమీషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్‌ అధికారులు పేర్కొన్నారు.