విజయసాయి.. ఏ సంచలనాలకు తెరలేపుతారు?
Published on: Mon Sep 7, 2026 9:44AM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విజయసాయిరెడ్డి తీరు సంచలనంగా మారింది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నంబర్ 2గా ఓ వెలుగు వెలిగి, వైసీపీ అధినేతకు కుడిభుజంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ తరువాత మారిన పరిణామంలో వైసీపీని వీడి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అలా రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు సొంతంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. తన రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటనకు సోమవారం (సెప్టెంబర్ 7) ముహూర్తం నిర్ణయించారు.

బెజవాడ వేదికగా ఆయన సోమవారం మీడియా సమావేశంలో కొత్త పార్టీ జెండా, అజెండావి ప్రకటించనున్నారు. వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి.. రాష్ట్ర రాజకీయాలపై తరచూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా ఆ స్కామ్ కర్తా, కర్మా, క్రియా రాజ్ కేసిరెడ్డి అని వెల్లడించిన సంగతి తెలిసిందే. వైసీపీలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, అవినీతిపై విజయసాయి దశల వారీగా వివరాలు వెల్లడిస్తూ.. ఆ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నంబర్ 2గా చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇటీవల ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో మరిన్ని సంచలనాలకు తెరలేపుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయి కొత్త పార్టీ విధి విధానాలు, పేరు, జండా, అజెండా ప్రకటించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Vijay Sai Reddy Vijayawada Pressmeet, AP Politics, Vijay Sai Reddy New Party, YCP Telugu Desham, AP Politics, Telugu One]


