TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్‌కు కవిత వల్ల మనోవేదన.. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Published on: Tue Sep 1, 2026 3:51PM

 

బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి..కవిత మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయిన వ్యక్తి..! 

తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గులాబీ దళంలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ విమర్శల తుఫాను రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఆవిర్భావానికి ముందే తమ కుటుంబం టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా పనిచేసిందని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్‌ఎస్ అని, కవిత కేవలం మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయిన వ్యక్తి మాత్రమేనంటూ ఆయన సంధించిన అస్త్రాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా తన మనసులోని వేదనను వ్యక్తం చేస్తూ, కవిత వైఖరి వల్ల కేసీఆర్ ఎంతగానో మనోవేదనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్‌కు కష్టకాలంలో కొండంత అండగా నిలబడింది ఎవరో కవిత తెలుసుకోవాలని ప్రశ్నించారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తించినందుకే గతంలో కవితపై అధిష్ఠానం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. సొంత తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌లను సైతం విమర్శించిన కవిత, తనపై ఆరోపణలు చేయడంలో ఆశ్చర్యం లేదన్నారు. కవితను రెండవసారి ఏకపక్షంగా ఎమ్మెల్సీగా గెలిపించడంలో తన పాత్ర ఏంటో గులాబీ అధినేత కేసీఆర్‌కు బాగా తెలుసని, కేసీఆర్ బిడ్డగా నిన్నటివరకు ఉన్న గౌరవాన్ని ఆమె తన వ్యాఖ్యలతో స్వయంగా పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీతో తాను మంతనాలు జరిపానంటూ కవిత చేసిన ఆరోపణలను లక్ష్మీనరసింహస్వామి సన్నిధానం సాక్షిగా వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాసనసభ లోపలా, వెలుపలా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఎవరో అందరికీ స్పష్టంగా తెలుసని అన్నారు. తాను కాంగ్రెస్‌తో ఏనాడూ రహస్య మంతనాలు జరపలేదని, మరి కవిత కాంగ్రెస్ నేతలతో రహస్య సంప్రదింపులు జరపలేదని చెప్పగలరా అని నేరుగా సవాలు విసిరారు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ, కవిత స్వలాభం కోసం కేసీఆర్‌కు దగ్గరగా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరిచి, పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయంగా సానుభూతి పొందేందుకే కవిత సభల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత తండ్రి ప్రతిష్టను, పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని హితవు పలికారు. ప్రశాంత్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ బీఆర్‌ఎస్ అంతర్గత విభేదాలను తీవ్రస్థాయికి చేర్చగా, రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

Vemula Prashanth Reddy, Kalvakuntla Kavitha, KCR, BRS Party, Telangana Politics, BRS Internal Conflict, KTR, Harish rao, Telugu one , Telugu news