అసెంబ్లీ వద్ద తొపులాట.. కిందపడిపోయిన హరీష్ రావు.. స్వల్పంగా గాయపడిన కేటీఆర్.!
Published on: Mon Sep 7, 2026 11:17AM

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద నల్ల చొక్కాలు, నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే ఉద్దేశంతో అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి కిందపడిపోయారు. కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. తోపులాట, ఉద్రిక్తతల మధ్యే పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు హరీశ్ రావును పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, అక్కడి నుంచి తరలించారు.
పోలీసుల తీరు దారుణంగా ఉందంటూ, అసెంబ్లీ ఎంట్రన్స్ వద్దే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల భూములు, ఇళ్లను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చి వేధిస్తున్నారని నిలదీయడానికే తాము నిరసన చేపట్టామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
[Tenssion At Telangana assembly, harish rao arrest, ktr, brs leaders arrested, Harish Felldown, KTR Injured, Telangana Politics, Telugu One]


