వైసీపీలో ‘కాపు’ కలవరం.!
Published on: Tue Jul 21, 2026 4:52PM

వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారా? సొంత పార్టీ లైన్ నే దాటుతూ, పార్టీ అధినేతకు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది. పార్టీలో కాపు సామాజికవర్గ నేతల తీరు వైసీపీకి గుబులు పుట్టిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీసీకి చెందిన కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడలో నిర్వహించతలపెట్టిన కాపుల ఐక్యత సభకు తాను హాజరవుతానని తోట త్రిమూర్తులు ప్రకటించడం వైసీపీకి మింగుడు పడటం లేదు. వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలతో సంబంధం లేకుండా తోట త్రిమూర్తులు స్వతంత్రంగా కాపు సామాజికవర్గ ఐక్యత నినాదంతో ముందుకు సాగుతుండటంతో వైసీపీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది.
అదు విధంగా వైసీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం కాపు రిజర్వేషన్లు, కాపు సామాజిక వర్గ హక్కుల విషయంలో ఇండిపెండెంట్ లైన్ తీసుకోవడం కూడా వైసీపీలో కలవరం రేపుతోంది. కాపు సామాజికవర్గానికి మేలు జరగాలంటే.. హక్కుల కోసం పోరాడాలి అంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ సంస్మరణ సభలు వేదికగా తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ లు జ్యోతుల నెహ్రూతో వేదిక పంచుకోవడం, తోట త్రిమూర్తులు బోండా ఉమా ఆధ్వర్యంలో కాపు ఐక్యత సభకు హాజరౌతానని ప్రకటించడంతో.. రానున్న రోజులలో కాపు సామాజికవర్గ ఐక్యత రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Tense in ycp, botsa, totatrimurthulu, Kapu, Leaders, Cross, Partyline Telugu One


