మన ఆహారపు అలవాట్లే మనకు శ్రీరామరక్ష!
posted on Mar 30, 2020 3:12PM
మన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. మన ఆహారపు అలవాట్లే మనకు శ్రీరామరక్ష అంటున్నారు తెలంగాణా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా దెబ్బకు అత్యాధునిక సంపన్న దేశాలే సతమతమవుతున్నాయి. ప్రపంచాని కంటే ముందే మనం మేల్కొన్నాం. ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ లు ముందే చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రి తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలి. స్వీయ, కుటుంబ, సమాజ, దేశ రక్షణకే స్వయం నియంత్రణ పాటిస్తున్నాం... అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్, కరీంనగర్ మినహా, అదృష్టవశాత్తు మిగతా ప్రాంతాల్లో కరోనా కేసుల్లేవు... అని మంత్రి చెప్పారు. భూపాలపల్లి జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ, వలస కూలీల స్థితిగతులు, ధాన్యం, మక్క జొన్న, మిర్చి పంటలు-కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో మంత్రి ఎర్రబెల్లి సోమవారం సమీక్షించారు.