గోల్కొండ కోట మీద పంద్రాగస్టు.. కేసీఆర్ పరిశీలన...

 

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటపై జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగర మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌, ప్రభుత్వ సలహాదారు పాపారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.కె.మీనా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గోల్కొండ పరిసరాలను రెండు గంటల పాటు పరిశీలించారు. కోటలోని తారామతి మజీద్‌ పైభాగంలో ఉన్న బాలా-ఈ-హిస్సార్‌ కింది భాగంలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని సర్కారు ఈ సందర్భంగా నిర్ణయించింది. తారామతి మజీద్‌ ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చిక బయలులో ఆహ్వానితులు ఆసీనులవుతారు. ఈ ప్రాంతం 10 నుండి 12 వేల మంది కూర్చోడానికి అనువుగా ఉంటుందని అధికారులు తేల్చారు.