వామనరావు హత్య వెనుక అసలు నిజమిదే! 

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. పోలీసుల విచారణలో బిట్టు శ్రీను సంచలన అంశాలు చెప్పాడని తెలుస్తోంది. అడ్వకేట్ దంపతుల హత్యకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళి సైని కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై  గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.  గవర్నర్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి .. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

వామనరావు దంపతుల హత్యలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నా.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శీలం రంగయ్య మృతి కేసులో వామన్‌ రావు దంపతులు హైకోర్టులో కేసు వేయడం, మంథనిలో టీఆర్ఎస్  అక్రమాలకు అడ్డుగా నిలవడంతోనే  పథకం ప్రకారం హత్య చేశారని  తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిసరాల్లో నుంచి రూ.4వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారని, దీనిపైనా వామన్‌రావు పోరాటం చేసేందుకు సిద్ధమవుతుండగా మట్టుబెట్టారని ఉత్తమ్ వివరించారు. 

న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య రాష్ట్ర చరిత్రలోనే అత్యంత  కిరాతకమైన ఘటన అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ తమిళి సైని కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. న్యాయవాద దంపతుల హత్యలో పోలీసుల పాత్ర ఉందని జనం నమ్ముతున్నారన్నారు.  పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టుకు అక్రమ మార్గంలో సేకరిస్తున్న నిధులను వామన్‌రావు బయటపెట్డడంతోనే అడ్డు తొలగించుకున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.