TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సికిందరాబాద్ మద్రాస్ రెజిమెంట్ లో భారీగా ఆయుధాలు చోరీ.!

Published on: Tue Sep 1, 2026 9:47AM

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సైనిక స్థావరాల్లో ఒకటైన సికింద్రా బాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ లో భారీగా ఆయుధాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది.  సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  

మిలిటరీ డిపో  స్టోర్ రూమ్ లాక్ పగులగొట్టి దాదాపు 12 అత్యాధునిక ఆయుధాలతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని అపహరించినట్లు తెలుస్తోంది.  సైనిక నిఘా, భద్రతా వ్యవస్థలు ఉన్న ప్రదేశంలోనే ఈ తరహా  చోరీ జరగడం రక్షణ రంగ వర్గాలలో  ఆందోళన వ్యక్తమౌతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం..   మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల గది తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు ఏకే47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ సహా   తుపాకులను చోరీ చేశారు. ఆయుధాలతో పాటు వీటికి సంబంధించిన మందుగుండు సామగ్రిని కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఉదంతం ఆదివారం (ఆగస్టు 30) రాత్రి సమయంలో జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించిన సైనిక అధికారులు..   బొల్లారం పోలీసు స్టేషన్లో  ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదు మేరకు  బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు ప్రారంభించారు. 

ఆయుధాల చోరీ వ్యవహారం   దేశ రక్షణ,  భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో దర్యాప్తు వివరాలను అధికారులు  గోప్యంగా ఉంచుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలోకి సాధారణ పౌరుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. ఈ భారీ  వెనుక స్థానిక సైనిక సిబ్బంది లేదా లోపలి పరిచయాలు ఉన్న వ్యక్తుల హస్తం ఉండి ఉండవచ్చనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   ఆయుధాలు, మందుగుండు సామగ్రి  ని ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.   కేసు విచారణలో భాగంగా మద్రాస్ రెజిమెంట్ ఆవరణలోని పరిసర ప్రాంతాలు, ఎంట్రీ, ఎగ్జిట్  ద్వారాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు  జల్లెడ పడుతున్నారు.

ఇటీవల కాలంలో ఆయుధాల గది వైపు వెళ్లిన వ్యక్తులు, విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది జాబితాను సేకరించి వారిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరోవైపు సైనిక విభాగం కూడా  అంతర్గత విచారణను వేగవంతం చేసింది.సైనిక దళాలకు చెందిన వ్యూహాత్మక ఆయుధాలు సాధారణ సమాజంలోకి లేదా అవాంఛనీయ శక్తుల చేతుల్లోకి వెళ్తే  పెను ప్రమాదమని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన మార్గాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలను విస్తృతం  చేశారు. ఈ భద్రతా లోపానికి బాధ్యులైన వారిని  గుర్తించి చోరీకి గురైన ఆయుధాలను రికవరీ చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 


[Secunderabad Madras Regiment Arms Theft, Hyderabad Cantonment News, Weapons Stolen,  Bollarum Police, Army Security Breach Secunderabad, Telugu One]