TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్ లో ప్రశాంతంగా పోలింగ్.. అంచనాలకు మించి ఓటెత్తిన జనం

Published on: Tue Nov 11, 2025 1:50PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో , చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌  సాయంత్రం 5 గంటల వరకు కొనగుతుంది.  ఈ విడతలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు . 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  

ఉదయం 9 గంటలకే 14.55 శాతంగా నమోదైన పోలింగ్ .. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికల్లా దాదాపు 50 శాతానికి చేరుకుంది. ఈ విడతలో తొలి దశకంటే అధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే భారీ పోలింగ్ ఏ కూటమికి అనుకూలం అనే విషయంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  కాగా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కిషన్ గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం నమోదు కాగా,  గయాలో 50.95, జుమాయిలో 50.91, బంకాలో 50.07శాతం ఓటింగ్ నమోదైంది. ఇక మధుబనిలో అయితే అత్యల్పంగా 43.39శాతం ఓటింగ్ నమోదైంది.  

రెండో విడత పోలింగ్ లో ఇప్పటి వరకూ ఓటు వేసిన ప్రముఖులలో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మంఝా, ఎంపీ పప్పుయాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్, బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి నితిష్ మిశ్రా, జుమాయ్ బీజేపీ అభ్యర్థి శ్రేయేషి సింగ్, ఇండిపెండెంట్ అభ్యర్థి జ్యోతి సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు షహనవాజ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకుడు అజీత్ శర్మ తదితరులు ఉన్నారు.