ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ వార్ కు ఎండ్ కార్డ్.!?
Published on: Wed Sep 9, 2026 3:26PM

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్ పడిందా? అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ దౌత్యం, చొరవ కారణంగా ఇది సాధ్యపడిందా? అంటే అంతర్జాతీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇక ముగిసినట్లేనని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య దాదాపు గంటకు పైగా సాగిన ఫోన్ భేటీలో ఉక్రెయిన్ సంక్షోభం, శాంతి స్థాపన, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల వంటి పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపారు.
ఈ ఫోన్ సంభాషణలోనే ఉక్రెయిన్ తో యుద్ధం ఎండ్ కు సంబంధించి పూర్తి అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. యుద్ధం ముగింపునకు పుతిన్ దాదాపుగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, భద్రతాపరమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ, సత్వర శాంతికి మార్గం సుగమం చేయాలని ట్రంప్ ఈ సందర్భంగా పుతిన్ ను కోరారు. ఉక్రెయిన్ సంక్షోభం సమసిపోతే వాషింగ్టన్, మాస్కో మధ్య ఆర్థిక, వాణిజ్య బంధాలు మరింత బలోపేతం కావడానికి మార్గం సుగమమౌతుందని ట్రంప్ చెప్పినట్లు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రతిపాదనలకు పుతిన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఉన్నత స్థాయి సంభాషణకు ముందు, అమెరికా దౌత్య బృందం రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి ఉన్నతాధికారులతో భేటీ అయింది. అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్ తదితరులు రష్యా అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఉక్రెయిన్ రాజధాని కీవ్కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ దౌత్యపరమైన ముందడుగుల నేపథ్యంలోనే పుతిన్, ట్రంప్ నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
[Russia Ukreain War End, Putin, Trump, Phone, Talk, Telugu One]


