బీజేపీలోకి జంప్ అని ప్రచారం చేస్తారు.. నేను అలాంటోడ్ని కాదు.. రేవంత్

జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు ప్రత్యర్థులపై ఎత్తులు పై ఎత్తులు, గిమ్మిక్కులతో ఓటర్లను బోల్తా కొట్టించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో గెలుపు కోసం ఎంతకైనా తెగించేలా పార్టీలు, నాయకుల వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి లింగోజిగూడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నాకు పదవి ఇవ్వనన్నారని… దీంతో మోడీ, షాలను కలిసి బీజేపీలో చేరబోతున్నానని దుష్ర్ఫచారానికి బీజేపీ కుట్ర చేస్తోందని అయన ఆరోపించారు. దీనికోసం టీవీ ఛానెళ్ల లోగోలతో మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియోలు గ్రేటర్ పోలింగ్ కు ఒకరోజు ముందు రాత్రి సర్క్యూలేట్ చేయడానికి పెద్ద కుట్రకు ప్లాన్ చేశారన్నారు.

 

తనపై వచ్చే ఇలాంటి చిల్లర ప్రచారాలపై కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. నేను జెండా మోసేందుకే తప్ప.. పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదని అయన స్పష్టం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిపై దుష్ర్ఫచారం చేసినట్టు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నాపై దుష్ర్ఫచారం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నాకు నిర్దిష్టమైన సమాచారం కూడా ఉందన్నారు.

 

దుబ్బాక ఎన్నికకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నాడంటూ ఒక ఛానెల్ లోగోతో దుష్ర్పచారాం చేశారని, అక్కడి యువత అది నిజమేననుకుని గందరగోళంలో పడి బీజేపీకి ఓటేశారన్నారు. అయితే ఈ కుట్రను గుర్తించి మేము తిప్పికొట్టే సరికే 40 శాతం పోలింగ్ కూడా అయిపోయిందని, ఇప్పుడు మరోసారి ఇలాంటి కుట్రను నాపై ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు.