ఎవరీ ప్రశాంత్ కిశోర్?.. పీకేకు ఎందుకంత డిమాండ్?
Published on: Thu Mar 10, 2022 4:40PM
ప్రశాంత్ కిశోర్.. అలియాస్ పీకే. పేరు కాదు.. ఇప్పుడు ఇదో బ్రాండ్. ఐపాక్కు దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్. పీకే టీమ్లో పని చేసిన వారికే కోట్లకు కోట్లు ముట్టజెప్పి స్ట్రాటజిస్ట్స్గా నియమించుకుంటున్నారంటే.. ఇక నేరుగా ప్రశాంత్ కిశోర్ సేవలే కావాలంటే మరెంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ నుంచి.. ఆంధ్రప్రదేశ్ వరకూ.. దేశ నలుమూలలా పీకే బిజినెస్కు బాగా గిరాకీ ఉంది. ఇక, తెలంగాణ చాణక్యుడినని తెగ ఫీలయ్యే కేసీఆర్ సైతం.. ప్రశాంత్ కిశోర్ శరణు జొచ్చారంటే మామూలు విషయమా? అటు జగన్.. ఇటు కేసీఆర్.. అక్కడ మమత.. ఈ పక్కన స్టాలిన్.. ఇలా.. అప్పుడెప్పుడో మోదీతో మొదలుపెట్టి.. ఇప్పుడు దేశమంతా అక్టోపస్లా వ్యాపించిన పీకేకు ఎందుకంత డిమాండ్? ఆయన కూడా అందరిలాంటి వాడేగా? కార్పొరేటర్గా కూడా పోటీ చేసి గెలవలేని ప్రశాంత్ కిశోర్.. ఏకంగా రాష్ట్రాల తలరాతే ఎలా మారుస్తున్నారు? ఆయన మదిలో మంత్రదండమేమైనా ఉందా? ఆయన మస్తిష్కంలో జిత్తులమారి చిప్ ఏమైనా దాగుందా?
1977లో బీహార్లో పుట్టాడీ ప్రశాంత్ కిశోర్. తండ్రి శ్రీకాంత్ పాండే వైద్యుడు. ప్రశాంత్ కిశోర్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు అమెరికాలో, ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగిగా పనిచేశారు. లెక్కల విశ్లేషణ, అద్భుత ప్రసంగాలు రాయడంలో దిట్టగా పేరు గాంచారు. ప్రశాంత్ కిశోర్ పని తనం గురించి తెలుసుకున్న అప్పటి గుజరాత్ సీఎం మోదీ.. 2012లో గుజరాత్ ఎన్నికల్లో తన గెలుపు కోసం సలహాదారుగా నియమించుకున్నారు. పీకే వ్యూహాలతో మోదీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇదేదో బాగుందని అనుకున్న పీకే.. 2014 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్గా.. 2013లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్-CAG అనే మీడియా ప్రచార సంస్థను స్థాపించారు. ఈ కాగ్తో బీజేపీ ఒప్పందం చేసుకుంది. అలా, 2014లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తల టీమ్లో ప్రశాంత్ కిశోర్ కీలకంగా మారారు..ఎదిగారు. నెలల తరబడి వ్యూహాలు, ఎత్తుగడలు రచించి అమలు చేశారు. ఆ ఎన్నికల్లో మోదీ చేపట్టిన.. "చాయ్ పే చర్చా" కార్యక్రమాలు, "3-డి ర్యాలీలు", "రన్ ఫర్ యూనిటీ", మంథన్ సోషల్ మీడియా ప్రోగ్రామ్లు లాంటి వినూత్న ప్రచార వ్యూహాలు పీకే క్రియేట్ చేసినవే అంటారు. అవి, బాగా వర్కవుట్ అయి.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ తెచ్చిపెట్టాయి. నరేంద్ర మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాయి. ఇంక అంతే. మోదీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే, అమిత్షా తో విభేదాల వల్ల.. పీకే బీజేపీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత CAGను ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ-IPACగా మార్చాడు. ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాని విజయాలు సొంతం చేసుకున్నారు.
2015లో బీహార్లో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ కోసం పని చేశారు. నితీశ్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడంలో సఫలం అయ్యారు. ఆ తర్వాత 2018లో అదే జేడీయూ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం కూడా చేశారు ప్రశాంత్ కిశోర్. కానీ, అనేక పార్టీలను గెలిపించిన ఆయన.. సొంతంగా మాత్రం రాజకీయాల్లో రాణించలేకపోయారు. పౌరసత్వ సవరణ చట్టం-2019పై, జేడీయూ అధిపతి నితీశ్ కుమార్తో విభేదించి.. 2020 జనవరి 29 న పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. ఇక తాను రాజకీయాల్లోకి రానని ఆనాడు ప్రకటించారు పీకే.
ఇక, 2017లో పంజాబ్, యూపీలో కాంగ్రెస్ కోసం పని చేసింది ఐపాక్. అయితే, పంజాబ్లో కాంగ్రెస్ను గెలిపించిన పీకే.. యూపీలో మాత్రం ఆయన వ్యూహాలు పని చేయలేదు. బీజేపీ హవా ముందు హస్తం పార్టీ నిలవలేకపోయింది. యూపీలో 300లకు పైగా స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. కేవలం 7 సీట్లతో చతికిలపడింది. "మంచ్ పే చర్చా" లాంటి స్ట్రాటజీలు వర్కవుట్ కాలేదు. అప్పటి వరకూ.. మాస్టర్ మైండ్గా చెలామని అయిన పీకేకు ఇది ఊహించని పరాభవమే.
ఇక, 2019 ఎన్నికల కోసం రెండేళ్ల ముందుగానే, 2017లోనే ఏపీలో జగన్-వైసీపీతో డీల్ కుదుర్చుకున్నారు పీకే-ఐపాక్. ఇక అంతే. అప్పటి నుంచీ రచ్చ రంబోలే. పీకే డైరెక్షన్లోనే వైసీపీ అభ్యర్థుల ఎంపిక జరిగింది. సమర శంఖారావం, అన్న పిలుపు, ప్రజా సంకల్ప యాత్ర.. లాంటి ప్రచార కార్యక్రమాలు తయారు చేసి జగన్ ప్రజల్లో ఉండేలా చేశారు. "ఒక్క ఛాన్స్".. "నేను విన్నాను-నేను ఉన్నాను".. లాంటి డైలాగ్స్ కూడా వారివే. జయహో జగన్.. సాంగ్ కూడా పీకే టీమ్ క్రియేట్ చేసిందే. కోడికత్తి డ్రామా వెనుకా పీకేనే ఉన్నారంటారు. అలా జగన్ను 151 సీట్లతో గద్దె ఎక్కించి.. ఏపీని సర్వనాశనం చేసిన పాపంలో ప్రశాంత్ కిశోర్కూ ఎంతో కొంత భాగం ఉందని మండిపడుతుంటారు.
2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కోసం పని చేసి.. కేజ్రీవాల్కు 70లో 62 సీట్లు తెచ్చిపెట్టారు. అదే 2020లో బీహార్ ఎన్నికల్లో వేలు పెట్టి చెయ్యి కాల్చుకున్నారు. ఇక, 2021లో తమిళనాడులో స్టాలిన్ కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకొని.. ఆయన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అదే 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ప్రశాంత్ కిశోర్ సామర్థ్యానికి పెను సవాల్ విసిరాయి. మమత బెనర్జీ తరఫున బీజేపీతో నేరుగా పోరాటమే చేశారు పీకే. తృణమూల్కి మూడంకెల సీట్లు రాకపోతే.. ఇకపై తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనంటూ తన కెరీర్నే పణంగా పెట్టి సవాల్ చేశారు. నందిగ్రాం నుంచి దీదీని పోటీ చేయించే సాహసం చేశారు. అయితే, అక్కడ మమతా ఓడిపోయినా.. బెంగాల్లో మాత్రం తృణమూల్ పార్టీ 213 సీట్లతో ఘనవిజయం సాధించడం.. ప్రశాంత్ కిశోర్ స్టామినాకు నిదర్శనం.
ప్రస్తుతం ఏపీలో జగన్-వైసీపీతో... తెలంగాణలో కేసీఆర్-టీఆర్ఎస్తో కలిసి పని చేస్తున్నారు ప్రశాంత్కిశోర్-ఐపాక్. అయితే, గెలుపుపై నమ్మకం లేనివాళ్లు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీలే.. పీకే సేవలను కొనుక్కుంటాయని అంటారు. తన బీహారీ స్టైల్ జిమ్మిక్కులు-గిమ్మిక్కులతో తిమ్మిని బమ్మి చేస్తూ.. విధ్వేషాలను రెచ్చగొడుతూ.. తనను నమ్ముకున్న పార్టీలను ఎలాగోలా గట్టెక్కిస్తారనే పేరైతే ఉంది. అయితే, యూపీ, బీహార్లో తన క్లయింట్స్ను గెలిపించలేక పోయిన బ్యాడ్ రికార్డ్ కూడా ఉండటం గుర్తించాల్సిన విషయం. కేవలం పీకేనే నమ్ముకుంటే పని కాదని.. ప్రజల్లో కాస్తోకూస్తో గుడ్విల్ ఉంటేనే గెలుస్తారనే లాజిక్కును మాత్రం మర్చిపోవద్దని సూచిస్తున్నారు. మరి, ఏపీ, తెలంగాణలో ఈసారి పీకే హిస్టరీ రిపీట్స్ చేస్తారా? లేదంటే.. జగన్, కేసీఆర్లను ఓడించి.. పీకే రికార్డును ఓటర్లు చెదరగొడతారా? చూడాలి మరి ఏం జరుగుతుందో....


