ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా గ్లోబల్ సౌత్ ఎదగాలి : ప్రధాని మోదీ
Published on: Sat Sep 12, 2026 5:37PM
.webp)
ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం..!
అంతర్జాతీయ నిర్ణయాలు విధాన రూపకల్పనలో వర్ధమాన దేశాల ప్రాతినిధ్యం మరింత బలోపేతం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేవలం నిబంధనలను పాటించే దేశాలుగా మిగిలిపోకుండా, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాత్మక శక్తిగా గ్లోబల్ సౌత్ ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.
దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన రెండు రోజుల వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రారంభోపసన్యాసం చేశారు. ఈ కీలక సదస్సుకు రష్యా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో వర్ధమాన దేశాలు వెనుకడుగున ఉంటున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్ మాదిరిగా తయారైందని, కేవలం ఉన్నత స్థాయిలో ఉన్న కొద్దిమంది చేతుల్లోనే అధికార కేంద్రీకరణ జరిగిందని ఆయన విమర్శించారు. కిందిస్థాయిలో ఉన్న దేశాలు మాత్రం కేవలం పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితి మాత్రమే ఉందని, దీన్ని మార్చి సమన్యాయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణ కోసం పలు నూతన ప్రతిపాదనలను ప్రధాని తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తక్షణమే చేపట్టాలని, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు ఇకపై ఆలస్యం చేయరాదని ఆయన తేల్చిచెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన దేశాలకు తగిన ఓటింగ్ హక్కులు, ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
కృత్రిమ మేధస్సు (AI), సైబర్ స్పార్క్, అంతరిక్షం, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో మారుతున్న నిబంధనలకు అనుగుణంగా గ్లోబల్ సౌత్ దేశాలు సన్నద్ధం కావాలని మోదీ సూచించారు. వర్ధమాన దేశాల యువ డిప్లొమాట్లు, నిపుణులకు ప్రత్యేక శిక్షణ మరియు చట్టపరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా అంతర్జాతీయ చర్చల్లో వారు ప్రభావవంతంగా రాణించవచ్చని తెలిపారు.
సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం నిర్వహించే నావికులు మరియు సముద్ర సిబ్బంది భద్రత కోసం 'సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్' ఏర్పాటు చేయాలని సదస్సులో ఆయన ప్రతిపాదించారు. కష్టకాలంలో ఉన్న నావికులకు వైద్య సహాయం, సంక్షేమ సేవలు అందించడంలో ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
భారత అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై వర్ధమాన దేశాలకు మరింత గౌరవప్రదమైన స్థానం దక్కేలా ఈ సదస్సు ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని సర్వత్రా అంచనా వేస్తున్నారు.
[ PM Modi, BRICS Summit, Global South, Rule Shaper, UN Security Council Reforms, Xi Jinping, Narendra Modi, BRICS Summit 2026, India China relations, Delhi news, India visit, Global South, Border Dispute Resolution, India China Relations, Telugu One, Telugu News ]


