పాకిస్తాన్ కేంద్రీకృత సంపద .. 22 కుటుంబాల నుండి కొత్త అధికార కేంద్రాల వరకూ.!
Published on: Thu Sep 3, 2026 5:30PM

పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు కేవలం కొద్దిమంది చేతుల్లోనే సంపద ఎలా కేంద్రీకృతమై ఉండేది, కాలక్రమేణా ఆ అధికార కేంద్రాలు ఏ విధంగా రూపాంతరం చెందాయనే అంశాలపై ఆర్థిక విశ్లేషకులు, నిపుణులు పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలోని ఆర్థిక వనరులు, భూములు, పరిశ్రమలు, రాజకీయ పలుకుబడి పరిమిత వర్గాల చేతుల్లోనే నిలిచిపోవడంపై సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. గతంలో ప్రముఖ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ 1968లో వెల్లడించిన ఒక విశ్లేషణ ప్రకారం, కేవలం 22 కుటుంబాలతో కూడిన ఒక చిన్న సమూహం పాకిస్తాన్ ఆర్థిక గమనాన్ని శాసించింది. ఇది కేంద్రీకృత యాజమాన్యానికి పెద్ద ప్రతీకగా నిలిచింది. ఆ తర్వాత దశాబ్దాలలో ఈ కుటుంబాల ప్రభావం ఏ మేరకు కొనసాగింది, కొత్తగా ఏ వర్గాలు ఉద్భవించాయనే అంశం గమనిస్తే.. అయూబ్ ఖాన్ హయాంలో అమలు చేసిన విధానాల వల్ల ప్రైవేట్ రంగ పారిశ్రామిక విస్తరణ వేగవంతమైంది.
దావూద్లు, సైగోల్లు, ఆదంజీలు, హబీబ్ కుటుంబం వంటి కొన్ని వ్యాపార బృందాలు ఈ పారిశ్రామిక వృద్ధిలో ప్రధాన లబ్ధిదారులుగా నిలిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. తయారీ, బ్యాంకింగ్ రంగాలలో ఈ కుటుంబాలు గణనీయమైన వాటాలను నియంత్రించాయి. అయితే 1971లో తూర్పు పాకిస్తాన్ విభజన ఈ పాత పారిశ్రామిక వ్యవస్థకు దెబ్బతిసిందని నిపుణులు వివరిస్తున్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కారణంగా అనేక ప్రముఖ వ్యాపార సమూహాలు అక్కడ ఉన్న తమ మిల్లులు, కర్మాగారాలు, వాణిజ్య ఆస్తులను కోల్పోయాయి. దీనివల్ల దేశంలో స్థిరపడిన వాణిజ్య నెట్వర్క్లు బలహీనపడి, ఆర్థిక శక్తి పంపిణీలో తీవ్ర మార్పులు సంభవించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆ తర్వాత 1970ల ప్రారంభంలో జుల్ఫికర్ అలీ భుట్టో సర్కార్ హయాంలో చేపట్టిన జాతీయీకరణ విధానాల వల్ల బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రధాన పరిశ్రమలు ప్రభుత్వ యాజమాన్యంలోకి వెళ్లడంతో పాత పారిశ్రామిక ఉన్నత వర్గాల ఆధిపత్యానికి గండిపడింది. జాతీయీకరణ విధానాలు కొన్ని ప్రైవేట్ పారిశ్రామిక సమూహాల ప్రభావాన్ని తగ్గించినప్పటికీ.. ఉన్నత వర్గాల పట్టు పూర్తిగా సడలిపోలేదు. ఈ విధానాల కారణంగా అధికారం కేవలం కొన్ని ప్రైవేట్ గ్రూప్ల నుంచి రాజకీయ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నిర్ణయాధికారుల చేతుల్లోకి మళ్లింది.
అసలు ఆనాటి 22 కుటుంబాలు ఒకే శక్తివంతమైన కూటమిగా నిలవలేకపోయాయని, వాటిలో చాలా వ్యాపార సంస్థలు కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యాయని, అలాగే తమ పూర్వ వైభవాన్ని కోల్పోయాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. కేవలం కొద్దిమంది వారసులు మాత్రమే మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యాపారాలను విస్తరించుకోగలిగారన్నది ఈ పరిశోధనల సారాంశం. కొన్ని సాంప్రదాయ వ్యాపార కుటుంబాలు కాలక్రమేణా కనుమరుగైనప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా వికేంద్రీకరణ జరగలేదని చెబుతున్నాయి. ప్రైవేటీకరణ, రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయాలు, సైన్యంతో ముడిపడిన సంస్థల నుంచి సరికొత్త సంపద, పలుకుబడి నెట్వర్క్లు ఆవిర్భవించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1990ల ప్రైవేటీకరణ కాలంలో మియాన్ మన్షా వంటి వారు నిషాత్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను చేజిక్కించుకుని శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజాలుగా ఎదుగారు.

అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బహ్రియా టౌన్ వంటి సంస్థల వృద్ధి కూడా ఉన్నత వర్గాల చేతుల్లో సంపద పోగవడానికి ఒక మార్గంగా నిలిచింది. ఇదిలాఉంటే.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సైనిక సంక్షేమ సంస్థలు, వాటితో ముడిపడి ఉన్న బహుళ వ్యాపార సముదాయాల పాత్ర కూడా కీలకమైనదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫౌజీ ఫౌండేషన్ వంటి సంస్థలు ఎరువులు, సిమెంట్, ఆహార రంగాలలో విస్తరించి, ప్రైవేట్ కుటుంబాలతో పాటు సంస్థాగత ఆర్థిక శక్తి ఏ స్థాయిలో ఉందో చాటుతున్నాయని వివరిస్తున్నారు. అయితే ఇటువంటి సంస్థల ఉనికి మార్కెట్ పోటీ, పారదర్శకత, ప్రభుత్వ అధికారానికి, వాణిజ్య ప్రయోజనాలకు మధ్య ఉండాల్సిన విభజనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రూపం మారిందే తప్ప, మూలాలపరంగా అది ఉన్నత వర్గాల ఆధిపత్యం నుంచి పూర్తిగా బయటపడలేదని చెబుతున్నారు. ప్రధాన కార్పొరేట్ యజమానులు, భూస్వాములు, రాజకీయ వంశాలు, సైనిక సంబంధిత సముదాయాల వద్దే సంపద కేంద్రీకృతమై ఉందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అంచనాలను వారు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పన్ను రాయితీలు, ఆర్థిక అధికారాల రూపంలో పాకిస్తాన్ జీడీపీలో సుమారు 6 శాతం మేర వ్యయం అవుతోందని, అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది జాతీయ ఆదాయంలో గణనీయమైన వాటాను పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. షరీఫ్లు, భుట్టోల వంటి ప్రధాన రాజకీయ కుటుంబాలు సైతం తమ రాజకీయ ప్రభావాన్ని భారీ భూస్వామ్య, పారిశ్రామిక ప్రయోజనాలతో మిళితం చేసి ఆర్థిక అధికార నిర్మాణంలో కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నారని విమర్శకులు గుర్తుచేస్తున్నారు.
ప్రజా విధానాలను ప్రైవేట్ ప్రయోజనాల నుంచి వేరు చేయడం ఇటువంటి అతివ్యాప్తి కారణంగా కష్టమవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలు సవాలు కేవలం చారిత్రక వారసత్వానికి సంబంధించినది కాదని, సంపద మరియు పలుకుబడి అసమానంగా పంపిణీ అయ్యే వ్యవస్థ కొనసాగడమే అసలైన ఆందోళనకర విషయమని విశ్లేషకులు తేల్చిచెప్పారు. దేశ భవిష్యత్ ఆర్థిక స్థిరత్వం కేవలం బాహ్య సహాయాల మీదో, స్వల్పకాలిక ద్రవ్య మద్దతు మీదో ఆధారపడి ఉండదని, పన్నులు, భూ వినియోగం, మార్కెట్ పోటీ, పారదర్శకత మరియు జవాబుదారీతనం వంటి అంశాలపై సమూల సంస్కరణలు చేపట్టినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Pakistan economy wealth concentration, 22 families Pakistan economic history, Pakistan elite capture and inequality, Pakistani corporate groups, military business, Mahbub ul Haq]


