TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆపరేషన్ సిందూర్.. గెలుపెవరిది?

Published on: Thu Sep 17, 2026 6:07PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన   ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో పాతిక మంది  ఇండియన్స్, ఒకరు నేపాల్ పౌరుడు.  ఈ దారుణానికి లష్కర్ఏతోయిబా ఉగ్రవాద సంస్థే కారణమని భారత్  భావించింది. అయితే  పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య   ఉద్రిక్తతలు చెలరేగి, చారిత్రక సింధు జలాల ఒప్పందం అమలును ఇండియా నిలిపివేసింది.   సరిగ్గా ఈ ఘర్షణల పరంపరలో భాగంగానే  ఇండియా   వ్యూహాత్మకంగా  ఆపరేషన్ సిందూర్' పేరిట ప్రతీకార చర్యలకు దిగింది. ఏ భూభాగమూ ఆక్రమించబడకపోయినా, ఎలాంటి యుద్ధ ఖైదీలు పట్టుబడకపోయినా ఈ సైనిక చర్యలో అసలు విజయం ఎవరిని వరించింది అనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.  

ఈ సైనిక చర్యలో భాగంగా మొదటి దశలో భారత బలగాలు   కచ్చితత్వంతో శత్రు దేశ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఐదు శిబిరాలను, పాకిస్తాన్ గడ్డపై ఉన్న పంజాబ్‌లో మరో నాలుగు శిబిరాలను కేవలం ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో ఎలాంటి పౌర ప్రాణనష్టం జరగకుండా ధ్వంసం చేసినట్లు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఈ దాడుల్లో భాగంగా బహావల్‌పూర్‌లోని జైషె మొహమ్మద్ ప్రధాన కేంద్రమైన  మర్కజ్ సుభాన్ అల్లాహ్ పై క్షిపణి ద్వారా గట్టి దెబ్బ కొట్టారు. ఈ ఘటనలో ఉగ్రమూక నేత మసూద్ అజర్ తన కుటుంబ సభ్యులు పది మందితో పాటు నలుగురు సన్నిహితులు మరణించినట్లు స్వయంగా ప్రకటించుకున్నాడు. మృతులలో మసూద్ అజర్  అక్క, బావమరిది వంటి వారు కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ దాడులకు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడికి ప్రయత్నించడంతో ఈ ఘర్షణ నాల్గు రోజుల పాటు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. 

ఇది 1971 తర్వాత అణు సామర్థ్యం కలిగిన రెండు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణగా రికార్డులకెక్కింది.  ఈ ఘర్షణల క్రమంలో భారత్ తన రెండో దశ దాడులను మరింత ఉధృతం చేసింది. బ్రహ్మోస్ అలాగే ఇతర అత్యాధునిక స్టాండాఫ్ ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్‌లోని పదకొండు ప్రధాన ఎయిర్‌బేస్‌లపై భారత్   దాడులు జరిపింది. ఈ దాడుల్లో నూర్ ఖాన్, సర్గోధా, స్కర్దు, భోలారీ, జకోబాబాద్, రహీం యార్ ఖాన్ వంటి కీలక ప్రాంతాల్లోని రన్‌వేలు, యుద్ధ విమానాల హ్యాంగర్లు   దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ స్వయంగా భారత డీజీఎంఓను సంప్రదించి కాల్పుల విరమణ కోరాల్సి వచ్చిందని భారత్ అధికారికంగా స్పష్టం చేసింది. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే కాల్పుల విరమణ జరిగిందన్న వాదనలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. ఇదే సమయంలో రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో సుదూర ప్రాంతం నుంచి గాలిలోకి ప్రయోగించి లక్ష్యాన్ని ఛేదించే అరుదైన రికార్డును సాధించినట్లు వెల్లడించింది. 

ఎస్-400 రక్షణ వ్యవస్థ సుమారు మూడు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి పాకిస్తాన్ ప్రత్యేక మిషన్ విమానాన్ని విజయవంతంగా కూల్చివేసినట్లు ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.  అయితే ఈ సైనిక చర్యల తదనంతరం ఇరు దేశాల నుంచి వెలువడిన ప్రకటనల్లోనూ, అంతర్జాతీయ వేదికలపై జరిగిన ప్రచారంలోనూ అనేక విభిన్న వాదనలు వినిపించాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి వేదికగా మాట్లాడుతూ తమ దేశ యుద్ధ విమానాలు ఏడు ఇండియన్  విమానాలను ధ్వంసం చేశాయని ప్రచారం చేశారు. కానీ పాకిస్తాన్ చెబుతున్న ఈ సంఖ్యల విషయంలో ఎక్కడా సరైన ఆధారాలు లేకపోగా, వారు పార్లమెంట్‌లో అయిదు అని, ఆ తర్వాత మరోచోట ఆరు అని, చివరకు ఐక్యరాజ్యసమితిలో ఏడు అని తమ వాదనలను మారుస్తూ వచ్చారు. మరోవైపు.. యుద్ధం ప్రారంభ దశలో భారత వైమానిక దళం కూడా కొన్ని నష్టాలను చవిచూసిందని భారత రక్షణ వర్గాలు,  సీఈఎస్ జనరల్ అనిల్ చౌహాన్ స్వయంగా అంగీకరించారు. రాయిటర్స్, సీఎన్ఎన్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఒక రఫేల్ విమానం కూలిపోయిందనే సమాచారాన్ని నివేదించాయి. నష్టాలను దాచిపెట్టకుండా, వాటిని అధికారికంగా అంగీకరించి, తద్వారా తమ వ్యూహాలను మార్చుకుని శత్రువుపై మళ్లీ విరుచుకుపడిన భారత సైనిక వ్యవస్థ తీరు సర్వత్రా ప్రశంసలందుకుంది.  

యుద్ధాలు రణరంగంలో ముగిసినప్పటికీ, వాటికి సంబంధించిన వాస్తవాలు ఎప్పుడూ రాజకీయ,  మీడియా కథనాల యుద్ధంగా మారుతుంటాయి. పాకిస్తాన్ తన దేశంలో రాజకీయ లబ్ధి కోసం, ప్రజలను మభ్యపెట్టడానికి గొప్ప వైమానిక విజయం సాధించామనే ప్రచారాన్ని నడిపింది. అమెరికా మధ్యవర్తిత్వం వల్లే యుద్ధం ఆగిందంటూ కొందరు నేతలు నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదనల వరకు వెళ్లగా..  భారత్ మాత్రం దీనిని ఖండిస్తూ ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారానే కాల్పుల విరమణ జరిగిందని తేల్చిచెప్పింది. చైనా,  అమెరికా ఆయుధ లాబీలు భారత్ ప్రభావాన్ని అణచాలని చూశాయనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, వాటికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. మీడియా రంగంలోనూ దేశీయంగా విజయాల ప్రచారం జరిగితే, అంతర్జాతీయ మీడియాలో మాత్రం నష్టాల గురించి పలు ప్రశ్నలు తలెత్తాయి. ఈ వైరుధ్యాల మధ్య నిజానిజాలను గ్రహించడం పాఠకుల బాధ్యతగా మారింది.  

భూభాగాల ఆక్రమణలు లేనప్పుడు, యుద్ధ ఖైదీలు ఎవరూ పట్టుబడనప్పుడు ఇలాంటి సైనిక చర్యల విజయాన్ని ఎలా అంచనా వేయాలనే ప్రశ్నపై రక్షణ నిపుణులు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సమూలంగా దెబ్బతీయడం, ఉగ్ర వ్యవస్థకు భారీ మూల్యం చెల్లించేలా చేయడం, శత్రువు గడ్డపైకి వెళ్లి కొట్టగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం వంటి లక్ష్యాలు భారత్ పూర్తిగా ప్రదర్శించింది. బహావల్‌పూర్, మురీద్‌కే దాడుల ద్వారా పాకిస్తాన్‌ను శాంతి మార్గం వైపు వచ్చేలా   చేయడంలో భారత్ విజయం సాధించింది. ఆరంభంలో ఎదురైన ఎదురుదెబ్బలను సైతం   గుణపాఠంగా మలుచుకుని, మరింత పటిష్టమైన వ్యూహాలతో శత్రు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత సైన్యం తన విశ్వసనీయతను మరింత పెంచుకుంది. పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన ప్రచారాలను పక్కన పెడితే, అధికారిక నివేదికలు,  స్పష్టమైన లక్ష్యాల సాధన ఆధారంగా ఆపరేషన్ సిందూర్ భారత్‌కు ఒక మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  


-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Operation Sindhur, India Pakistan War, S400 Defense System, Masood Azhar, Ministry of Defence Report, Win, Telugu One]