తుక్కుగూడలో దారుణం.. నర్స్ అనుమానాస్పద మృతి..!
Published on: Sun Aug 30, 2026 3:01PM

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయం లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. శిరీష మృతికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారా లను సేకరించడంతో పాటు ఆస్పత్రిలోని పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
శిరీష మృతిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుమార్తె ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సుమారు ఏడు నెలలుగా నర్స్గా పనిచేస్తోందని తెలిపారు. శానుదుల్లా ఖాన్ అనే యువకుడు తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశాడని ఆరోపించారు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే తాము ఆస్పత్రికి చేరుకున్నామని, తమ కుమార్తె మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని వారు పోలీసులను కోరారు. ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శంషాబాద్ డీసీపీ రాజేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసు అధికారులతో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బందిని విచారించడంతో పాటు శిరీష మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అత్యాచారం, హత్య జరిగిందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలు నిజమా? లేక మరేదైనా కారణంతో శిరీష మృతి చెందిందా? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా మృతికి అసలు కారణాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
Nurses suspicious death, Tukkuguda, Ranga Reddy District, DCP Rajesh, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu news


