TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ రావాలి : నారా లోకేష్

Published on: Wed Sep 16, 2026 9:32PM

కోవూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే కార్యకర్తలకు మరింత న్యాయం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని లోకేష్ అన్నారు. వైసీపీ నాయకులు కుల, మతాల పేరుతో విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. గతంలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.

సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని లోకేష్ సూచించారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటు రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని అన్నారు. 16 వేల టీచర్ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశామని తెలిపారు.

రాష్ట్రానికి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థల పెట్టుబడులు రావడాన్ని ప్రస్తావించిన లోకేష్.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులతో పాటు వైసీపీ ప్రచారాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

డీఎస్సీపై జగన్‌కు లోకేష్ సవాల్..

డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు తనను ప్రశ్నిస్తున్నారని లోకేష్ విమర్శించారు. డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. టీచర్ పోస్టుల భర్తీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులను ఆశ్రయించినా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అన్నారు. డీఎస్సీపై తనతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

కుటుంబం వేరు.. రాజకీయం వేరు..

కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని లోకేష్ అన్నారు. రాజకీయాలను, కుటుంబ సంబంధాలను వేర్వేరుగా చూడాలని సూచించారు. తన కుటుంబ సభ్యులపై గతంలో జరిగిన వ్యక్తిత్వ హనన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రత్యర్థి నాయకుల కుటుంబ సభ్యుల గురించి తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని తెలిపారు.

కార్యకర్తే అధినేత..

‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్నామని లోకేష్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధి ద్వారా ఇప్పటివరకు రూ.175 కోట్లు అందించామని తెలిపారు. కార్యకర్తలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలోపేతం కావాలన్నదే లక్ష్యమన్నారు. మైటీడీపీ, మైహెల్త్ యాప్‌లను వినియోగించాలని సూచించారు.నా తెలుగుదేశం–నా బాధ్యత’ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యకర్తలు నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ కొనసాగింపు అవసరం..

ప్రభుత్వాలు తరచూ మారడం వల్ల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. కోవూరు టీడీపీకి బలమైన నియోజకవర్గమని పేర్కొన్న లోకేష్.. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు మాట్లాడుతూ కోవూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం లోకేష్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సమావేశంలో బీద మస్తాన్‌రావు, మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, బీద రవిచంద్ర, మద్దిపాటి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

[ Nara Lokesh, TDP, Telugu Desam Party, Kovur, Nellore, Local Body Elections, NDA Alliance, Andhra Pradesh Politics, YSRCP, YS Jagan Mohan Reddy, Mega DSC, DSC Recruitment, Teacher Jobs, TDP Cadre, Political Controversy, AP Politics, Chandrababu Naidu, Coalition Government, TDP Workers, Welfare Schemes, Development, Veemireddy Prashanthi Reddy, Veemireddy Prabhakar Reddy, NTR Statue, Kovur TDP, Local Elections AP ]