మీటూ కేసులో నానా ప‌టేక‌ర్‌కు క్లీన్ చిట్.. త‌నుశ్రీ ద‌త్తాకు షాక్

 

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా. లెజెండ‌రీ యాక్ట‌ర్ నానా ప‌టేక‌ర్ త‌నతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా లైంగిక వేధింపుల‌కు కూడా పాల్పడ్డాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అయితే ఈ ఆరోపణలు అబద్దమని నానా ప‌టేక‌ర్ కొట్టి పారేస్తూ వచ్చారు. తనుశ్రీ దత్తా చేసిన ఫిర్యాదు ఆధారంగా నానా పటేకర్ పై లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. అయితే, ఇప్పుడా వ్యవహారంలో నానా పటేకర్ కు ఊరట లభించింది. ఆయన తప్పు చేశారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదించారు. దాంతో నానా పటేకర్ ను న్యాయస్థానం నిర్దోషిగా పేర్కొంది.

పదేళ్ల క్రితం 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సెట్స్‌లో త‌న‌ను నానా ప‌టేక‌ర్ లైంగికంగా వేధించాడ‌ని తనుశ్రీ దత్తా ఆరోపించింది. అయితే నానా పటేకర్‌ తప్పు చేసాడ‌ని చెప్ప‌డానికి ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో.. కోర్టు ఆయ‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే త‌నుశ్రీ‌ త‌ర‌ఫు లాయ‌ర్ సుజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాక్ష్యాలు లేవని ఈ కేసును కోర్టు కొట్టేసింది. ఇప్ప‌టికీ తనుశ్రీ ద‌త్తా కావాల‌నుకుంటే ప్రొటెస్ట్‌ రిపోర్ట్‌ను దాఖలు చేయొచ్చ‌ని.. దీనివ‌ల్ల మూసేసిన కేసును కూడా మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపించే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. దీనిపై తనుశ్రీ స్పందిస్తూ.. నానా పటేకర్ కు భయపడి కొందరు సాక్ష్యులు ముందుకు రావడంలేదని వ్యాఖ్యానించారు.