నాగోబా ఆలయ ప్రధాన పూజారి తెలంగాణ రక్షణ సేనలో చేరిక..!
Published on: Sun Sep 13, 2026 4:51PM

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పార్టీలో చేరారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాగోబా ఆలయంతో మేస్రం వంశీయులకు ఉన్న అనుబంధం నేపథ్యంలో మేస్రం ఆనందరావు పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కల్వకుంట్ల కవితకు నాగోబా ఆలయంపై ప్రత్యేక భక్తి ఉంది. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఆమె నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

నాగోబా అమ్మవారి ఆశీస్సులు తమపై సంపూర్ణంగా ఉన్నాయని కవిత విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్దగా ఉన్న ఆనందరావు చేరిక పార్టీకి మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. మేస్రం ఆనందరావుతో పాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణ తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు తెలంగాణ రక్షణ సేన నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే జోష్ను కొనసాగిస్తూ ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొడంగల్ సభ అనంతరం ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహపరిచేలా ఇంద్రవెల్లి సభను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు, గోండులు, బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలోకి ఆకర్షించేలా ఈ సభను వేదికగా మలచాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో అక్టోబర్లో ఇంద్రవెల్లిలో జరగనున్న బహిరంగ సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
[ Nagoba temple pradhana pujari, Adilabad District, Keslapur, Mesram dynasty, Telangana Rakshana Sena, Indravelli Sabha, Kalvakuntla Kavitha ]


