పోలీసుల లాఠీచార్జ్.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు గాయాలు
posted on Jun 20, 2019 11:06AM
హైదరాబాద్ పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించవద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు గాయాలయ్యాయి. పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. రాజాసింగ్ ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.