హైదరాబాద్కు నాలుగు దిక్కుల్లో బస్ టెర్మినల్స్ : మంత్రి పొన్నం
Published on: Tue Sep 15, 2026 4:36PM
.webp)
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి పరిష్కారం చూపడంతో పాటు ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. నగరంలోకి వచ్చే దూరప్రాంత, అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగర నడిబొడ్డులోకి రాకుండా శివారు ప్రాంతాల్లోనే నిలిపివేసేలా బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.హైదరాబాద్కు నాలుగు వైపులా బస్ టెర్మినల్స్ అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాలను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నగరంలోకి ప్రవేశించే బస్సులను వాటి ప్రయాణ దిశకు అనుగుణంగా సమీపంలోని టెర్మినల్స్కే పరిమితం చేయనున్నారు. అక్కడి నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు సిటీ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా తరలించేలా ఏర్పాట్లు చేయనున్నారు. దూరప్రాంత బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు టెర్మినల్స్ వద్దే సులభమైన రవాణా సౌకర్యం కల్పించనున్నారు. సిటీ ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను టెర్మినల్స్తో అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.ప్రయాణికులు ఒక రవాణా సాధనం నుంచి మరోదానికి సులభంగా మారేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల నగరంలోకి వచ్చే వారికి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజా రవాణాపై ఆధారపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

విమానాశ్రయం వైపు రాకపోకలు సాగించే బస్సులు, ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సులను కూడా అవసరాన్ని బట్టి నిర్దేశించిన టెర్మినల్స్ వద్దే నిలిపేలా విధానం రూపొందించనున్నారు.హైదరాబాద్లో ప్రైవేట్ బస్సుల పార్కింగ్ కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ బస్సులు నగర రోడ్లపైకి రావడం వల్ల రద్దీతో పాటు కాలుష్యం పెరుగుతోందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రైవేట్ బస్సులను కూడా ప్రత్యేక టెర్మినల్స్ నుంచే నడిపించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టెర్మినల్స్ వినియోగానికి నిబంధనలకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు వసూలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ విధానం అమలైతే వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదు.
ఫలితంగా ప్రధాన రహదారులపై బస్సుల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బస్ టెర్మినల్స్ నిర్మాణానికి అవసరమైన భూమిని సమకూర్చే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాజులరామారంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ పరిసరాల్లో దాదాపు 150 ఎకరాల భూమిని టెర్మినల్స్ కోసం కేటాయించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్లో పెరిగే ప్రయాణికుల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని టెర్మినల్స్ను రూపొందించనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు, వాహనాల పార్కింగ్, ప్రజా రవాణా అనుసంధానం వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో కీలక మార్పుగా రానున్న 2,200 ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించనున్నారు. టెర్మినల్స్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేర్చేందుకు ఈ బస్సులను ఉపయోగించేలా రూట్లను రూపొందిం చనున్నారు.
టెర్మినల్స్కు వచ్చే ప్రయాణికులకు అక్కడి నుంచే సిటీ బస్ సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా దూరప్రాంత బస్సులను నగరంలోకి తీసుకురాకుండానే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రజా రవాణా విధానంలో మార్పులు అనివార్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగర శివార్లలో టెర్మినల్స్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి మెట్రో, ఎంఎంటీఎస్, సిటీ బస్సుల ద్వారా ప్రయాణికులను పంపించే వ్యవస్థను అభివృద్ధి చేస్తే నగరంలోని ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దూరప్రాంత బస్సులను నగర అంతర్గత రోడ్లకు దూరంగా ఉంచడం ద్వారా వాహనాల రద్దీతో పాటు ఇంధన వినియోగం, కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక, సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
[ Minister Ponnam Prabhakar, Gajularamaram, Shamshabad, LB Nagar, Ghatkesar, Hyderabad, Shamshabad, TGRTC, Telangana Goverment ]


