తెలంగాణలో లాక్ డౌన్ పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చినట్లేనా..!
posted on Jul 9, 2020 10:01AM
తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించండి అంటూ ఉద్యోగులు, ఆరోగ్య శాఖ వారు కోరుతున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ కొద్దీ రోజుల క్రితం ప్రకటించారు. త్వరలో లాక్ డౌన్ పై కేసీఆర్ ఒక ప్రకటన చేస్తారని స్వయంగా వైద్య శాఖా మంత్రి ఈటెల కూడా ప్రకటించారు. ఐతే అటు క్యాబినెట్ భేటీ జరగలేదు.. ఇటు సీఎం కేసీఆర్ కూడా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఐతే తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత అంత ప్రాముఖ్యత కేటీఆర్ కు ఉన్న నేపథ్యంలో తాజాగా లాక్ డౌన్ విషయంలో అయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. మనకు జీవితం మాత్రమే కాదు జీవనోపాధి కూడా ముఖ్యమేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఐతే జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటు లాక్ డౌన్ విధించకుండా అటు టెస్టుల సంఖ్య పెంచకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.