తరుముకొస్తున్న జల సంక్షోభం.. ప్రజా భాగస్వామ్యంతోనే అధిగమించడం సాధ్యం.!
Published on: Fri Aug 28, 2026 10:24AM

ఇండియాలో అర్బన్ ప్రాంతాల్లో నీటి సంక్షోభాన్ని సాధారణంగా తక్కువ వర్షపాతం, అడుగంటిన జలాశయాలు, జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు వంటి కారణాలు చెబుతారు. ఈ కారణాలు పూర్తిగా వాస్తవం కాదు. పాక్షిక వాస్తవం మాత్రమే. ఇండియన్ సిటీస్ నీటి కొరతకు ఈ కారణాలతో పాటు.. పాలనా లోపం కూడా కారణమే. వనరుల సుస్థిరత, సమాన పంపిణీ, డిమాండ్ నిర్వహణ, భూగర్భ జలాల పరిరక్షణ, మురుగునీటి పునర్వినియోగం, పౌర బాధ్యతల అసుసంధానంలో పాలకులు విఫలం కావడం ప్రధాన కారణం.

నీటి భద్రత అనేది ప్రభుత్వ విభాగాలు అందించే వస్తువుగా, పౌరులు వినియోగించుకునేదిగా మాత్రమే చూడటం సరికాదు. ఇది సమష్టి బాధ్యతగా చూడాలి. అది లోపించడం దేశమంతటా ఒకేలా ఉంది. ముంబైలో భారీ వర్షాలు కురిసినా, నీటి కొరత ఉంటుంది. అలాగే చెన్నైలో ఏటా భారీ వర్షపాతం నమోదైనా నీటికి కటకటే.. అలాగే పూణెలో పుణె వేసవిలో నీటి కొరత, వర్షాకాలంలో వరదలతో సతమతమవ్వడం, బెంగళూరులో వర్షపాతం ఉన్నా, భూగర్భ జలాలు పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వైరుధ్యానికి ప్రధాన కారణం పట్టణ ప్రణాళిక వైఫల్యం. ఒక నగరంలో ఎంత వర్షం కురుస్తుంది అనేది మాత్రమేకాక, ఎంత నీరు సద్వినియోగం అయ్యింది. కురిసిన వర్షపాతంలో ఎంత నీటిని సేకరించి, నిల్వ చేసి, భూమిలోకి ఇంకించి, పునర్వినియోగించి, పంపిణీ చేస్తున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంది. వర్షపు నీటిని తుఫాను నీరుగా, ఆ తుఫాను నీటిని వరదలుగా, మురుగునీటిని కాలుష్యంగా మారడం అంటే.. అది ఘోరమైన జల నిర్వహణ లోపం అనే చెప్పాలి.
కర్నాటక రాజధాని బెంగళూరు ఇప్పుడు ప్రమాదపుటంచున ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నగరంలోని చారిత్రాత్మక సరస్సులు-చెరువుల వ్యవస్థ ఒకప్పుడు వికేంద్రీకృత నీటి నిర్వహణ వ్యవస్థగా పనిచేస్తూ, నీటి నిల్వకు, భూగర్భ జలాల పునరుజ్జీవనానికి, వరదల నియంత్రణకు తోడ్పడింది. అయితే నగర విస్తరణ, ఆక్రమణలు, పరీవాహక ప్రాంతాల క్షీణత, కాలుష్యం ఆ వ్యవస్థను బలహీనపరిచాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్వీర్యం చేశాయి. ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణ, సమాజ భాగస్వామ్యంతో బెంగళూరులో ఒప్పుడు దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయి. సరస్సుల సమూహాలు, నివాసితుల సంఘాలు, పర్యావరణ సంస్థలు, ప్రజా భాగస్వామ్యంతో బెంగళూరు గండం నుంచి బయటపడే దిశగా సాగుతోంది.

సామాజిక యాజమాన్యం లేని సాంకేతికత మౌలిక సదుపాయాల మెరుగునకే దోహదం చేస్తే.. ప్రజా భాగస్వామ్యంతో కూడిన సాంకేతికత పాలనగా మారుతుంది. అంటే.. ఒక మురుగునీటి శుద్ధి కర్మాగారం, పునరుజ్జీవన నిర్మాణం లేదా పునరుద్ధరించిన సరస్సును పౌరులు అర్థం చేసుకోక, పర్యవేక్షించక, రక్షించుకోక ముందే, అవి సాంకేతికంగా విజయం సాధించినా సామాజికంగా విఫలమవుతాయని అర్ధం. మౌలిక సదుపాయాల కల్పన అవసరమే కానీ, డిమాండ్ను నియంత్రించకుండా సరఫరాను విస్తరించడం రాబోయే సంక్షోభాన్ని వాయిదా వేయడమే అవుతుంది. అంతే కాకుండా మరింత పెను సంక్షోభాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.
ప్రస్తుతం ఇండియాలో నీటి యాజమాన్యం విషయంలో ప్రజా భాగస్వామ్యం ఆశించదగినది అనే స్థాయి నుండి తప్పనిసరి అనే స్థాయికి చ ేరుకుంది. ప్రభుత్వం ఒక సరస్సును సంరక్షిత ప్రాంతంగా ప్రకటించినా, కానీ పౌరులు అందులో చెత్త వేయడాన్న, ఆక్రమించడాన్ని నివారించాలి. నిబంధనలు వర్షపు నీటి సేకరణను తప్పనిసరి అని ప్రకటించినంత మాత్రాన సరిపోదు.. ప్రజలు ఆచరించాలి. అంటే జలయాజమాన్యంలో ప్రజా భాగస్వామ్యం కీలకంగా మారాలి.
looming water crisis, public participation Must toOvercome, Urban Water Shortage


