నైతిక విలువలకు తిలోదకాలు.. జర్నలిజం ముసుగులో అమానుష వ్యాఖ్యలు!
posted on Jun 9, 2025 3:42PM

వరుస దెబ్బలు తగులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వచ్చినట్టు కనిపించడం లేదా? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల పట్ల ఉండాల్సిన నిబద్ధత మరచి మరీ జగన్ అనుంగు మీడియా వ్యవహరించడం చేటు తెస్తుందా? అంటే అదే నిజమని తెలుస్తోంది. బేసిగ్గా పొలిటీషియన్లు నోటి మాట అదుపు తప్పినపుడు దాన్నొక రాజకీయ ఆరోపణ కింద లైట్ తీస్కునే వెసలుబాటు ఉంటుంది. వెనకుండి ఎవరో నడిపించి ఉంటార్లెమ్మని జనం అర్ధం చేసుకుంటారు. ఈ మధ్య అలాక్కూడా ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అన్న మాటలు.. వైయస్ జగన్ ఆయన పార్టీ లీడర్ల సంస్కారం ఏపాటిదో ఎత్తి చూపించాయి. ఈ విషయంలో సాక్షాత్ ఆ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్లే ఉదాహరణ. తమ ఘోర ఓటమికి ఇలాంటి కామెంట్లే కారణమని ఆయన ఎలాంటి శషబిషలూ లేకుండా అంగీకరించారు. తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా అంగీకరిస్తామని ఆయన చెప్పారు.
మాములుగా రాజకీయనాయకులు ప్రేలాపలనలకు పాల్పడితే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత సగటు జర్నలిస్టులకు ఉంటుంది. బేసిగ్గా జర్నలిజంలో పిల్లలు, మహిళలు, వృద్ధులు, ప్రాంతీయ కలహాలు, కుల,మత, వర్గ, వైషమ్యాలను రెచ్చగొట్టేలాంటి వ్యవహార శైలి కనబరచకూడదు. డూస్ అండ్ డోంట్స్ లో ఇవన్నీ ఒక పాఠంగా చెబుతారు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన ఓ చానెల్ లో నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అటువంటి కనీస ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు. అమరావతిపై వేశ్యల రాజధాని అన్న ముద్ర వేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. వారి వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలు చాలా చాలా సీరియస్ అయ్యారు. వారిపై ఫిర్యాదులు చేయడంతో పాటు వారి దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టారు.
ఇంతకీ ఇదెలా వెలుగులోకి వచ్చిందోనని చూస్తే.. ప్రపంచ అత్యధిక జనాభా గలిగిన దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న భారత్.. హెచ్ఐవీ బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. ఏయే రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎలా ఉందో పీఎంపీఎస్ఈ సంస్థ ఒక సర్వే చేసింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశం మొత్తం మీద 9, 95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేసింది. భారత్ లో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే టాప్లో ఉన్నట్టు తేల్చింది.
దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15.4 శాతం మంది కర్ణాటకలో ఉండగా.. ఏపీలో 12 శాతం మంది ఉన్నారనీ.. ఇక తెలంగాణలో 7.6 శాతం ఉన్నట్టు లెక్కలు రాసుకొచ్చిందీ సంస్థ. అంటే దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో సుమారు 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అన్నది ఈ సర్వే రిపోర్ట్ సారాంశం. దీన్ని ఒక అప్రధాన్యతకు సంబంధించిన వార్తగా ప్రచురించాలి సహజంగా అయితే. కానీ దాన్ని అమరావతి అనే రాజధానికి లింకు పెట్టి.. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ వేశ్యలంతా ఉన్నారని చెప్పడం అర్ధరహితం, అమానుషం, అనైతికం. ఇది జర్నలిస్టిక్ విలువలను సమూలంగా తుంగలో తొక్కడంతో సమానం. పొట్టకూటి కోసంఆ వృత్తిలో ఉన్నవారి రీహాబిలిటేషన్ జరగాలి. జర్నలిజం, జర్నలిస్టులు అందుకోసం వార్తలు రాయాలి. విశ్లేషణలు చేయాలి. గతంలో తెలంగాణలోని యాదగిరి గుట్టలో కూడా అదే జరిగింది. అప్పట్లో మీడియా యాదాద్రికి వేశ్య ముద్ర వేసి అపఖ్యాతి పాలు చేయలేదు. బాధ్యతగా వ్యవహరించింది. అది కనీస సంస్కారం, విజ్ఞతతో కూడిన జర్నలిజం.
కానీ ఇప్పుడు కొమ్మినేని, కృష్ణంరాజు జర్నలిజం ముసుగులో అసహ్యమైన, అమానుషమైన, అనైతిక ప్రచారానికి ఒడిగట్టారు. కొద్ది కాలం కిందట వైఎస్ సతీమణి భారతీరెడ్డిపై తెలుగుదేశం మద్దతుదారు అయిన కిరణ్ చేబ్రోలు అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినందుగానూ వెంటనే అలెర్ట్ అయిన కూటమి ప్రభుత్వం అతనిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. పరిణితి ప్రదర్శించింది. కానీ వైసీపీలో మాత్రం అటువంటి పరిణితి ఇసుమంతైనా కనిపించడం లేదు. ఇదే వైఖరిని వైసీపీ కొనసాగిస్తే ముందుముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.