కొండా.. కాషాయ జెండా.. డీల్ కుదిరేసిందా?
Published on: Sat Sep 5, 2026 3:09PM

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు మాజీ మంత్రి కొండా సురేఖ అడుగులు ఎటు అన్న చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. కేబినెట్ నుంచి తనను బర్త్ రఫ్ చేసిన తరువాత మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన కొండా సురేఖ.. తాను కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాజకీయ పరిశీలకులు మాత్రం ఆమె ఇంకెంత మాత్రం కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు లేవనే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే.. ఇప్పటికే ఆమె తన ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో వరుస భేటీలు జరుపుతూ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల భోగట్టా మేరకు ఆమె ఇహనో, ఇప్పుడో పార్టీ మార్పు విషయంపై ఒక ప్రకటనచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుమార్తె సుస్మిత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొండా కుటుంబం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, కొండా సురేఖ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు బీజేపీనుంచి ఆహ్వానం అందిందని కూడా చెబుతున్నారు. కొండా సురేఖ బీజేపీ గూటికి వస్తే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయని చెబుతున్నారు.

అయితే కొండా సురేఖ మాత్రంరాష్ట్ర నాయకత్వం కంటే నేరుగా ఢిల్లీలోని జాతీయ హైకమాండ్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోవాలని కొండా సురేఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను మాత్రమే కాకుండా భర్త కొండా మురళి, కుమార్తె సుష్మితతో కలిసి హస్తిన వేదికగా బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆమె కాషాయం జెండా పట్టాలని భావించడమే కాకుండా, తన చేరికకు కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా కొండా రాకను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఇందుకు కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, సీనియర్ నాయకురాలు డీకే అరుణ తదితరులు రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఒక బీసీ మహిళా మంత్రిని బర్త్ రఫ్ చేయడం సరికాదని విరుచుకుపడడమే సంకేతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Konda Surekha Join BJP, Telangana politics, Congress party, Konda couple, Daughter Sushmita, Telugu One]


