కవితకు కోర్టులో చుక్కెదురు ... బెయిల్ నిరాకరణ 

మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. కవితకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ ఇప్పటికే పూర్తి కాగా ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ.. కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని పేర్కొంది. వాదనల సందర్భంగా.. ఎలాంటి ఆధారాలు లేకున్నా తన క్లయింట్ కవితను అక్రమంగా అరెస్టు చేశారని కవిత లాయర్ వాదించారు. ఈ వాదనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసుతో పాటు లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులతో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అంతకుముందు తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరచాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ నూ కోర్టు తోసిపుచ్చింది.