బీఆర్ఎస్ను చీల్చేందుకు హరీశ్ రావు కుట్ర.. కవిత సంచలన ఆరోపణలు..!
Published on: Thu Aug 27, 2026 5:01PM
.webp)
సీఎం రేవంత్తో లండన్ లాలూచీ.. బీజేపీతో హరీశ్ మిలాఖత్..!
మాజీ మంత్రి హరీశ్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని తన హస్తగతం చేసుకునేందుకు హరీశ్ రావు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే లేపారు. మెదక్ జిల్లాకు చెందిన పలువురు కీలక ఎమ్మెల్యేలతో హరీశ్ రావు రహస్య సమావేశం నిర్వహించారని కవిత సంచలన విషయాలను బయటపెట్టారు. అసలు ఈ సీక్రెట్ మీటింగ్లో ఎన్టీఆర్ పేరును ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో చెప్పాలని కవిత నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఆక్రమించుకుని, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకోవాలనేది హరీశ్ రావు మాస్టర్ ప్లాన్ అని ఆమె ఘాటుగా ఆరోపించారు.ఈ కుట్ర వెనుక ఉన్న దాగిన కోణాలను బయటపెడుతూ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో హరీశ్ రావు క్రమం తప్పకుండా టచ్లో ఉన్నారని కవిత వ్యాఖ్యానించారు. హరీశ్ రావుకు బీజేపీ అధిష్టానంతో లోపాయికారీ మిలాఖత్ ఉందనడానికి తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
కేవలం సొంత పార్టీ నేతలపైనే కాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా హరీశ్ లండన్ వేదికగా చేసుకున్న లాలూచీ ఒప్పందం ఏంటో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయం మాత్రమే కాకుండా తీవ్రమైన ఆర్థిక, క్విడ్ ప్రో కో ఆరోపణలను కూడా కవిత గుప్పించారు. రాష్ట్రంలో ఎంతో పేరున్న నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై హరీశ్ రావు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు.
ఈ విద్యా సంస్థలకు, హరీశ్ రావుకు మధ్య పెద్ద ఎత్తున క్విడ్ ప్రో కో జరిగిందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా నారాయణ, చైతన్య సంస్థలకు ఏకంగా రూ. 960 కోట్ల విలువైన పాల సరఫరా కాంట్రాక్ట్ జరిగిందని గణాంకాలతో సహా బయటపెట్టారు. తెలంగాణలో ఎన్నో ప్రముఖ డెయిరీలు అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం హరీశ్ రావుకు సంబంధించిన డెయిరీ నుంచే రూ. 960 కోట్ల విలువైన పాలు ఎందుకు సరఫరా అవుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు.
అంతేకాకుండా యశోద ఆసుపత్రికి విలువైన భూముల కేటాయింపులు, పాల సరఫరా కాంట్రాక్టుల వెనుక ఉన్న అసలు సూత్రధారి హరీశ్ రావు అని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అది పూర్తిగా అవినీతి మయంగా మారుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కవిత చేసిన ఈ సంచలన ఆరోపణలు, రూ. 960 కోట్ల క్విడ్ ప్రో కో లెక్కలు ఇప్పుడు గులాబీ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Kalvakuntla Kavitha allegations, Harish Rao BRS controversy, Medak MLAs secret meeting, Narayana Chaitanya 960 crores, Kavitha press meet, Telangana political news, Telugug News, Telugu One


