వధువు మెడలో మూడు ముళ్లు.. వేసిన కల్వకుంట్ల కవిత..!
Published on: Wed Aug 26, 2026 5:30PM
.webp)
పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు. కానీ ఈ వివాహ వేడుకలో మాత్రం ఓ ఆసక్తికరమైన సంప్రదాయం అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు బాషబోయిన బాలప్రసాద్ పెళ్లిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆడబిడ్డగా మారి ప్రత్యేక వివాహ తంతును నిర్వహించారు. ఈసీఐఎల్–కీసర క్రాస్రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్లో బుధవారం బాలప్ర సాద్–శివాని వివాహం జరిగింది.
బాలప్రసాద్కు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో.. తన వివాహంలో ఆడబిడ్డగా ఉండాలని ఆయన కవితను కోరినట్లు సమాచారం. ఆయన కోరిక మేరకు కవిత వివాహ వేడుకలో ఆడపడుచు బాధ్యతను స్వీకరించారు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం.. వరుడు మంగళసూత్రం కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముదారంతో వధువు మెడలో మూడు ముళ్లు వేయించే ఆచారం ఉంది.
అందులో భాగంగా కవిత వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు. అనంతరం వధువుకు ప్రదానపు ఉంగరం తొడిగడంతో పాటు ఒడిబియ్యం పోసి ఆశీర్వదించారు. ఆ తర్వాత వరుడు బాల ప్రసాద్ శివాని మెడలో మంగళసూత్రం ధరింప జేశారు. కవిత ఇలా “ఇంటి ఆడబిడ్డ”గా మారి సంప్రదాయాన్ని పూర్తి చేయడం వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Kalvakuntla Kavitha, Telangana Rakshana Sena, Bashaboyina Balaprasada Wedding,
ECIL, Keesara Crossroad


