భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్.. ఇక పర్యాటక పవర్ హౌస్.!
Published on: Fri Aug 28, 2026 9:27AM
.webp)
ఇండియాలోనే ప్రకృతి అందాలకు చిరునామా అయిన కాశ్మీర్ లోయ, ప్రస్తుతం ఇక పర్యాటక పవర్ హౌస్ గా మారబోతోంది. ఇటీవల అమెరికా రాయబారి సెర్గియో గోర్ శ్రీనగర్లో పర్యటించి, జమ్మూ కాశ్మీర్పై విధించిన స్థాయి 4 ప్రయాణ నిషేధ అడ్వైజరీని పునస్సమీక్షించనున్నట్లు చెప్పారు. దీంతో ఇక జమ్మూ కాశ్మీర్ పర్యాటకం పరుగులు తీయనుంది. ఇంత కాలం విదేశీ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ వైపు చూడాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే వారు. ఎందుకంటే ఇక్కడ భద్రతకు సంబంధించిన ఆందోళనలు, అమెరికా అడ్వైజరీ వారిని ఇక్కడ పర్యటించే విషయంలో ముందువెనుకలాడేలా చేసేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ఇక్కడి పర్యాటక సామర్థ్యం, రవాణా అనుసంధానం, ఆర్థిక పురోగతి దిశగా సాగుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం, అక్కడ భద్రతా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇప్పుడు ర్గియో గోర్ అన్యాపదేశంగానే అయినా విస్పష్టంగా ఇచ్చిన సంకేతాలు జమ్మూకాశ్మీర్ విషయంలో భద్రతా పరంగా ఎటువంటి ఆందోళనా అవసరం లేదని ప్రపంచ దేశాల పర్యాటకులు విస్పష్టంగా చాటినట్లైంది. ఈ గుర్తింపు రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్ ను మరీ ముఖ్యంగా కాశ్మీర్ లోయను ప్రపంచ స్థాయి టూరిజం హబ్ గా మార్చేందుకు దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంపై ఉన్న టూరిజం శాంక్షన్స్ తొలగిస్తే.. విదేశీ విమానయాన సంస్థల నిర్ణయాలు, బీమా ప్రీమియంలు, టూర్ ఆపరేటర్ల ప్యాకేజీలు వెల్లువెత్తి.. ఇక్కడ పర్యాటకం పరుగులు తీస్తుంది. అది జమ్మూకాశ్మీర్ ఆర్ధిక వ్యవస్థను కూడా పరుగులెత్తిస్తుంది.
దేశీయ పర్యాటకం విషయంలో జమ్మూ కాశ్మీర్ ఇప్పటికే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. 2024లో ఏకంగా 2.3 కోట్లకు పైగా స్వదేశీ పర్యాటకులు కాశ్మీర్ లోయను సందర్శించారు. అయితే.. విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం చాలా నిరుత్సాహజనకంగా ఉంది. 2025–26 సంవత్సరంలో 36 వేల మంది విదేశీ పర్యాటకులు కాశ్మీర్ను సందర్శించారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించగలిగితే.. అలాగే అధిగమించగలిగితే.. ముందు ముందు అంతర్జాతీయ పర్యాటకులు భూతల స్వర్గం వంటి కాశ్మీర్ సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. తాజాగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ లో ఇక భద్రతా పరమైన సమస్య విషయంలో ఆందోళన అవసరం లేదంటూ ఇచ్చిన సంకేతాలు.. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కేందుకు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగితే.. ఆర్థికంగా రాష్ట్రం పురోగతి సాధిాస్తుంది. అలాగే.. పరోక్షంగా, ప్రత్యక్షంగా 5 లక్షల మందికి కాశ్మీరీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కాశ్మీర్ భవిష్యత్తును మార్చడంలో రవాణా కనెక్టివిటీ కీలకం. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మరియు జెడ్-మోర్ టన్నెల్ ప్రారంభం కావడం వల్ల కాశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలలో కనెక్టివిటీ మెరుగైంది. శ్రీనగర్ విమానాశ్రయం విస్తరణ, రివర్ టూరిజం, రోప్వేలు, కొత్త పర్యాటక కారిడార్ల నిర్మాణంతొ ర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. రహదారులు, హోటళ్లు, వ్యర్థాల నిర్వహణ, టెలికాం నెట్వర్క్, అత్యవసర వైద్య సేవలు పర్యాటకుల రద్దీకి అనుగుణంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ పర్యాటకం పుంజుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. పర్యాటక రంగాన్ని ఒక పరిశ్రమగా కాకుండా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి వ్యూహంగా మార్చాలి. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి గైడ్లుగా మార్చాలి. మహిళా స్వయం సహాయక సంఘాలను హోమ్స్టేలు, స్థానిక వంటకాలు, చేతివృత్తుల తయారీలో భాగస్వాములను చేయాలి. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను పర్యాటకానికి అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలి. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, భూటాన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్వత పర్యాటక దేశాల నుండి భద్రత, పర్యావరణ పరిరక్షణ, రెస్క్యూ మేనేజ్మెంట్ అంశాలలో మేలైన పద్ధతులను అధ్యయనం చేసి, ఇక్కడ వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
Jammu Kashmir Tourism Power House, America, Wirtdraw, Tourism Caution


