TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ కొత్త ఐడియాలు రావా?.. లేవా?.. బెడిసికొడుతున్న పాత వ్యూహాలు

Published on: Sat May 2, 2026 3:16PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.  

ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.  

సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు. 

నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.