TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిడిల్ ఈస్ట్‌ లో అమెరికా సైనిక స్థావరాలపై పెంటగాన్ పునరాలోచన?

Published on: Sun Sep 13, 2026 9:32AM

సెప్టెంబర్ 11, 2001 దాడుల అనంతరం ప్రపంచ రాజకీయాల్లో మహాశక్తుల ఆధిపత్య ధోరణిలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా తన శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుని, అక్కడ తమ పట్టును ఎప్పుడూ చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చనే బలమైన నమ్మకంతో ఉంది. కానీ గడిచిన రెండున్నర దశాబ్దాల కాలంలో ఏర్పడిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్‌తో   సుదీర్ఘ పోరు ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేశాయి. 

ఇరాన్‌తో చెలరేగిన  ఘర్షణల నేపథ్యంలో బహ్రెయిన్‌లోని  కీలకమైన అమెరికా నావికా స్థావరం   దెబ్బతిన్నట్లు ఆ దేశ తాత్కాలిక నేవీ సెక్రటరీ హంగ్ కావో బహిరంగంగా అంగీకరించడంతో వాషింగ్టన్ అధికార వర్గాల్లో తీవ్రమైన మధనం మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో అమెరికా కొనసాగిస్తున్న శాశ్వత సైనిక ఉనికిపై సమగ్రమైన పునరాలోచన జరుగుతోంది.  చరిత్రను పరిశీలిస్తే, మిడిల్ ఈస్ట్‌లో అమెరికా తన సైనిక బలగాలను ఏకపక్షంగా మోహరించడం గడిచిన కొన్ని దశాబ్దాలుగా క్రమంగా జరుగుతూ వచ్చింది.
 1979-80 కాలంలో జరిగిన ఇరాన్ విప్లవం, సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ దండయాత్ర వంటి పరిణామాల తర్వాత అమెరికా అప్పట్లో గల్ఫ్ ప్రాంతాన్ని తమ జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ప్రాంతంగా ప్రకటించింది. దీనిలో భాగంగానే 1995 నాటికి బహ్రెయిన్ రాజధాని మనామా కేంద్రంగా అమెరికా నావికా దళాల సెంట్రల్ కమాండ్ మరియు ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. అయితే 9/11 దాడుల తర్వాత ఈ ఉనికి కేవలం పరిమితంగా కాకుండా అరడజనుకు పైగా దేశాల్లో శాశ్వత సైనిక, గూఢచార స్థావరాల ఏర్పాటుకు దారితీసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా యుద్ధాల సమయంలో ఈ ప్రాంతంలో అమెరికా సైనికుల సంఖ్య లక్షల్లోకి చేరింది. నేడు ఇరాన్ తో జరిగిన తాజా యుద్ధం కారణంగా ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది సైనికులు, శక్తివంతమైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్లు మోహరించి ఉన్నప్పటికీ, రక్షణ పరమైన సవాళ్లు పెరిగిపోయాయి.  తాజా ఘర్షణల కాలక్రమాన్ని గమనిస్తే..  గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య అమెరికా తన సైనిక శక్తిని ఇరాన్ చుట్టూ భారీగా పెంచింది. జెనీవాలో జరిగిన అణు చర్చలు విఫలమైన తర్వాత ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా,  ఇజ్రాయెల్   సంయుక్తంగా ఇరాన్‌పై భారీ దాడులను ప్రారంభించాయి. తొలి రోజుల్లోనే వందలాది దాడులు జరగడంతో పాటు ఇరాన్ సైతం వెనుకాడకుండా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై   ప్రతిదాడులకు దిగింది. కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్,  జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలు ఈ దాడుల లక్ష్యంగా మారాయి. మార్చి నెల ప్రారంభంలో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆ దేశ సైన్యంలో తీవ్ర కలవరం సృష్టించింది. 

ఆ తర్వాత దౌత్యపరమైన ప్రయత్నాలతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు   చల్లారలేదు.  ఈ సాయుధ పోరులో బహ్రెయిన్‌లోని నేవల్ సపోర్ట్ యాక్టివిటీ  కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు, ఇంటర్వ్యూల ద్వారా స్పష్టమైంది. స్థావరంలోని కమాండ్ ప్రధాన కార్యాలయం, పలు భవనాలు, శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్ ధ్వంసమయ్యాయి. యుద్ధం ప్రారంభ దశలోనే సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. షిప్‌యార్డ్ సందర్శన సందర్భంగా నేవీ సెక్రటరీ హంగ్ కావో ఇరాన్ దాడుల తీవ్రతను ప్రస్తావిస్తూ స్థావరం దెబ్బతిన్న వైనాన్ని వెల్లడించారు. ఈ స్థాయి ఉన్నతాధికారి ఒకరు బహిరంగంగా ఈ నష్టాన్ని అంగీకరించడం అమెరికా సైనిక చరిత్రలో అరుదైన పరిణామంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

 ఈ పరిణామాల నేపథ్యంలో పెంటగాన్,  నిఘా వర్గాలు మిడిల్ ఈస్ట్‌లో తమ భవిష్యత్తు వ్యూహంపైరహస్యంగా చర్చిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో సైనికుల సంఖ్యను క్రమంగా తగ్గించడం, తీవ్రంగా దెబ్బతిన్న స్థావరాలను మళ్లీ అత్యధిక ఖర్చుతో పునర్నిర్మించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం వంటి అంశాలపై మధనం జరుగుతోంది. భవిష్యత్తులో డ్రోన్, క్షిపణి దాడుల నుంచి రక్షణ పొందేందుకు వీలుగా స్థావరాలను భూగర్భంలోకి మార్చడం లేదా ప్రాంతీయ భాగస్వాములపైనే రక్షణ భారాన్ని మోపడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అమెరికా లోపల ఈ యుద్ధం రాజకీయంగా,  చట్టపరంగా కూడా చర్చకు దారితీసింది.   కాంగ్రెస్ అనుమతులు లేకుండా దాడులు నిర్వహించడంపై కొందరు సెనేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రభుత్వ విధానాన్ని సమర్థించేవారూ లేకపోలేదు.  ఈ సంక్షోభం కేవలం సైనికపరమైన నష్టాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఇంధన మార్కెట్లను తీవ్రంగా కుదిపేసింది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా గల్ఫ్ దేశాల నుంచి జరిగే చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ వంద డాలర్ల మార్కును దాటాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇది తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపింది. 

చమురు దిగుమతి బిల్లు విపరీతంగా పెరగడం, దేశీయంగా ఇంధన ధరల నిర్వహణ ప్రభుత్వాలకు సవాల్‌గా మారడం వంటి పరిణామాలు సాధారణ ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ గణాంకాల ప్రకారం ఇది చరిత్రలోనే అతిపెద్ద చమురు సరఫరా అంతరాయాలలో ఒకటిగా నిలిచింది.  మొత్తంగా చూస్తే, గత రెండున్నర దశాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చిన శాశ్వత స్థావరాల ఆధారిత వ్యూహం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆధునిక యుద్ధ తంత్రంలో స్థిరమైన సైనిక స్థావరాలు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయనే వాస్తవాన్ని ఈ సంఘటనలు రుజువు చేశాయి. రాబోయే కాలంలో అమెరికా తన విదేశీ సైనిక విధానంలో ఎలాంటి మార్పులు చేస్తుందనేది కేవలం పశ్చిమాసియా రాజకీయాలనే కాకుండా ప్రపంచ దేశాల శక్తి సమతూకాన్ని కూడా నిర్ణయించనుంది. యుద్ధాలు ముగిసినప్పటికీ, అవి మిగిల్చిన భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక ప్రభావాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   


[Iran War, US military bases, Bahrain naval base, Pentagon strategy, West Asia crisis,Telugu One]