కడియం, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు 

బీఆర్ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.
 కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతోపాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో కేసులో హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది.కడియం శ్రీహరి బిఆర్ఎస్ లో  కీలక నేతగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో  స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తప్పించి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చి కెసీఆర్ గెలిపించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ లో బిఆర్ఎస్ ఘోరంగా పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి ఇచ్చిన స్టేట్ మెంట్ తెలంగాణలో చర్చకు దారితీసింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బిఆర్ఎస్ అధికారంలో వస్తుందని కడియం ప్రకటించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరారు. ఇది బిఆర్ఎస్ కు కంటగింపుగా మారింది. దీంతో కడియంపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.