తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు.!
Published on: Tue Aug 25, 2026 9:13AM

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టులు నిండుకునే పరిస్థితి తప్పదన్న ఆందోళనల నడుమ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నీటి ఎద్దడి బెడదను తప్పించాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఈ వర్షాలు ఎండిపోతున్న పంటలకు జీవం పోశాయి. అదలా ఉంటే ఈ భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది.
ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 1,405 అడుగులకు చేరువైంది. శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటిమట్టం 44 టీఎంసీలు దాటింది. కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 17 గేట్లు ఎత్తి 74 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కు వరద పోటెత్తడంతో 85 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
మరోవైపు, భారీ వర్షాల కారణంగా ఇల్లందు, మణుగూరులోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 28 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
heavt rains in telangana, Heavy Inflow, Water, Singareni, Coal Production


