గంజాయి చాక్లెట్ల దందా గుట్టు రట్టు.!
Published on: Sun Aug 30, 2026 7:12AM

సమాజంలో రోజురోజుకూ మారుతున్న నేరాల తీరు తీవ్ర కలవరపెడుతోంది. సాధారణంగా కిరాణా కొట్లు, పాన్షాప్లలో చాక్లెట్లు విక్రయించడం మామూలే.. కానీ, అదే పాన్షాప్ ముసుగులో యువతను పెడదోవ పట్టించేలా గంజాయి చాక్లెట్ల వ్యాపారం సాగుతున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం తూముకుంట పరిధిలోని చంద్రారెడ్డి కాలనీలో ఈ గంజాయి చాక్లెట్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.
బీహార్ కి చెందిన 29 ఏళ్ల బైద్నాద్ అనే వ్యక్తి తన భార్య పూజా కుమారి, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ శామీర్పేట మండలం తూముకుంటలోని చంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ పోషణ కోసం స్థానికంగా ఒక చిన్న పాన్షాప్ను నడుపుతున్నాడు. అయితే, చిన్న దుకాణంలో వచ్చే పరిమిత సంపాదనతో సంతృప్తి చెందకుండా.. అడ్డదారి తొక్కాడు. గంజాయి చాక్లెట్ల విక్రయాల వైపు అడుగులు వేశాడు.
ఇందు కోసం బైద్నాద్ బీహార్ నుంచి రహస్యంగా ఈ మత్తు చాక్లెట్లను రప్పించి తన పాన్ షాపులో విక్రయించడం మొదలు పెట్టాడు. 200 రూపాయలకు లభించే 40 చాక్లెట్లతో కూడిన ఒక ప్యాకెట్ 500 600 రూపాయల వరకూ వరకు విక్రయించడం మొదలు పెట్టాడు. చూడడానికి సాధారణ చాక్లెట్ల మాదిరిగానే కనిపించే ఈ చాక్లెట్ల విక్రయం ద్వారా సులభంగా అధిక ఆదాయం వస్తుండటంతో అతడీ అక్రమ దందాకు అలవాటుపడ్డారు.
ఈ దందాపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శామీర్పేట పోలీసులు నిఘా పెట్టి, షాప్ యజమాని బైద్నాద్ను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించగా భారీగా గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. 5 వేల 298 చాక్లెట్ ప్యాకెట్లు, పాతిక కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతని భార్య పూజ పరారీలో ఉంది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Ganja chocolates, Shamirpet Panshop,Paan Shop Raid, Drug Peddling, Cannabis chocolates, Telangana News, Telugu One


