ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా.. ఈవీఎంల భద్రతపై డౌట్

 

ఈవీఎంల భద్రతపై టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించిన  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్ట్రాంగ్‌ రూముల దగ్గర పరిస్థితి చూడడానికి బాగానే కనబడుతోంది.. అయితే, సీసీ కెమెరాల పనితీరు సరిగా లేకపోయినా, పర్యవేక్షణ సమర్థంగా లేకపోయినా ఈవీఎంలను బయటకు తరలించే  అవకాశం ఉందనే అనుమానాలన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశాల విషయంలో తెలంగాణను చూసీ చూడనట్టు వదిలేస్తున్న ఈసీ.. ఏపీపై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. సమీక్షా సమావేశాల నిర్వహణలో ఏపీలో ఒకలా.. మిగతా రాష్ట్రాల్లో మరోలా జరుగుతున్నా ఎందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంలేదని గల్లా జయదేవ్ ప్రశ్నించారు.