విద్యుత్ షాక్తో ఏనుగు మృతి... విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు.!
Published on: Wed Sep 2, 2026 1:20PM

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలోని పాపిరెడ్డిగారిపల్లె సమీపంలో మామిడి తోటలో మగ ఏనుగు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
.webp)
ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులు, లోపాలపై నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
[Elephant Died with Electric Shok, electrocuted, pawan kalyan elephant death probe, ap forest department, Telugu One]


