వరుస పేలుళ్లతో దద్దరిల్లిన బంగ్లా రాజధాని ఢాకా.!
Published on: Sat Sep 19, 2026 4:09PM

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఢాకా నగరంలోని ఏడు వేర్వేరు ప్రదేశాలలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. మాలిబాగ్, మొహఖాలీ, అగార్గ్రావ్, జత్రాబరి, మొఘ్బజార్, బాబుబజార్ మరియు రాంపురాతో పాటు ఢాకా కాలేజీ సమీపంలోనూ ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లకు తోడు కాఫ్రూల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సును దుండగులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అకస్మాత్తు పరిణామాలతో అప్రమత్తమైన ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు యంత్రాంగం రాజధాని వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతిభద్రతలను కాపాడేందుకు నగరలో 200కి పైగా పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టింది.

ఈ పేలుళ్ల వెనుక ఎవరున్నారన్న విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకూ 515 మందిని అరెస్టు చేసి 47 కేసులు నమోదు చేశారు. మిర్పూర్ డివిజన్లో అత్యధికంగా 120 మందిని అరెస్టు చేశారు. ఇదే కేసుకు సంబంధించి మరో 16 మందిని డిటెక్టివ్ బ్రాంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ పేలుళ్ల కు సంబంధించి పోలీసులు విస్తృతంగా జరిపిన సోదాలలో భారీగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఢాకా వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతుండగా, ఈ వరుస దాడులకు గల అసలు కుట్ర కోణంపై నిఘా వర్గాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి.
[Dhaka Serial Blasts, Bangladesh Capital, Dhaka High Alert, Crude Bomb Explosions, Dhaka Police Check]


