వైద్యుల సూచన మేరకు రేపు కేరళకు వెళ్లనున్న పవన్..!
Published on: Fri Aug 21, 2026 6:56PM
.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజంలోని రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ తీసుకోనున్నారు. ఇటీవల ముంబైలో పవన్ కళ్యాణ్ కుడి భుజంలోని రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని, బహిరంగ కార్యక్రమాలు, అధికారిక విధులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.
అయితే రాష్ట్ర పాలనా వ్యవహారాల దృష్ట్యా ఆయన ఎక్కువ కాలం విశ్రాంతికి పరిమితం కాలేదు. శస్త్రచికిత్స జరిగిన వారం రోజులకే క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. ముందుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించడంతో పాటు పార్టీకి సంబంధించిన అంతర్గత సమావేశాల్లోనూ పాల్గొన్నారు. వరుస కార్యక్రమాలతో భుజంపై ఒత్తిడి పెరగడంతో శస్త్రచికిత్స చేసిన ప్రాంతంలో వాపు అధికమైంది.
దీనికి తోడు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. దీంతో వైద్యులు మరోసారి ప్రత్యేక చికిత్స, తగిన విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ కేరళలో ప్రత్యేక ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నారు. భుజం గాయం పూర్తిగా నయం కావడం కోసం కేరళ వెళుతున్నారు. చికిత్స పూర్తయిన అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆయన తదుపరి అధికారిక కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
Deputy CM Pawan Kalyan, Kerala, Ayurvedic Therapy, Rotator cuff, right shoulder, Ayurvedic treatment


