TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీలిమిటేషన్ సెగ: చంద్రబాబుకు తలనొప్పేనా?

Published on: Tue Jun 16, 2026 4:42PM

తెలుగువన్ స్పెషల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ )బిల్లు  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారన్న వార్తలతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే..  దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో 543 స్థానాలను మరో 9 శాతం పెంచాలని చేసిన సిఫారసులే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గతంలో 2009లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం నియోజక వర్గాల సరిహద్దులను మాత్రమే మార్చారు..   సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఈసారి సీట్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. విచిత్రం ఏంటంటే, ఈ విభజన అంతా జనాభా ప్రాతిపదికన సమపాళ్లలో జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాకెట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ పునర్విభజన చేసేలా ఆర్థిక సలహా మండలి నివేదిక ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న  అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా సీట్లు పెరగవు. ఇదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే..  ఈ సిఫారసుల వల్ల కోస్తా తీర ప్రాంతాలైన విజయవాడ, ఏలూరు వంటి బలమైన కేంద్రాల్లో స్థానాలు పెరగడం లేదు. కానీ వైసీపీకి  మొదటి నుంచి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఏకంగా 10 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, అనంతపురం వంటి ఐదు కీలక పార్లమెంట్ నియోజక వర్గాలను ఒక్కొక్కదానిని మూడు మూడు నియోజక వర్గాలుగా విస్తరించాలని చూస్తున్నారు. కేవలం హిందూపూర్‌ను మాత్రమే ఇందులో వదిలేశారు. వైసిపి బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో.. ఆ పార్టీకి పట్టున్న ప్రాంతంలో ఇలా సీట్లు పెరగడం భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డికి కలిసివచ్చే అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే   కార్యక్రమమేనని సీనియర్ జర్నలిస్టులు వీవీ రావు, గోపి విశ్లేషించారు. 

ఇటు తెలంగాణలోనూ ఇదే వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో అత్యంత ధనిక ప్రాంతాలైన చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాలను రెండు లేదా మూడుగా విభజించే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ( ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విభజన ద్వారా భవిష్యత్తులో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు అవసరం లేకుండా, ఒంటరిగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలనేది బిజెపి అసలు వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో మహిళా బిల్లు సమయంలో నియోజక వర్గాల పెంపు కోసం విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ స్వరాష్ట్రంలో ఇలాంటి అసమానతలతో కూడిన విభజన ప్రతిపాదన వస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సరిహద్దుల మార్పు రాజకీయం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.