ఆర్య వైశ్యుల ఆత్మగౌరవం గొప్పది : సీఎం రేవంత్
Published on: Sun Sep 13, 2026 1:59PM
.webp)
ఆర్యవైశ్యులు సౌమ్యులు.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆర్యవైశ్యుల్లో చాలామంది పేదరికంలో ఉన్నప్పటికీ.. ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడరన్నారు. కష్టాలు, బాధలు ఉన్నా.. సమాజంలో గౌరవంగా జీవించడానికే ఆర్యవైశ్యులు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు.
గ్రామాల్లో ఆర్యవైశ్యుల సేవలు..!
గ్రామంలో ఎవరైనా పేదరికంలో ఉంటే.. కనీసం తినడానికి అప్పు ఇచ్చే వారు ఆర్యవైశ్యులేనని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా.. మొదట గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్య సోదరులేనని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రధానంగా రెండు వృత్తులే ఉన్నాయని.. అవి వ్యవసాయం, వ్యాపారం అని సీఎం వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించేవారని గుర్తుచేశారు.
రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడిందంటే.. అందుకు ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య కీలక కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాను శాసనమండలిలో దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో రోశయ్య తనను పిలిచి.. ఆవేశం తగ్గించుకుని, అనుభవంతో ముందుకు వెళ్తే రాజకీయాల్లో పైకి వస్తావని ఆశీర్వదించారని గుర్తుచేశారు. తనను ముందుగా గుర్తించింది రోశయ్యేనని చెప్పారు. రోశయ్య విమర్శలు చేయకుండా.. చురకలు వేస్తూ తనదైన శైలిలో మాట్లాడేవారని అన్నారు. ఆయన గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రపంచస్థాయి నాయకుడు మహాత్మా గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ గాంధీ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వకారణమన్నారు. పొట్టి శ్రీరాములు పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని.. దేశ సమగ్రత కోసం గాంధీ ప్రాణత్యాగం చేస్తే.. ఆంధ్రప్రదేశ్ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించారని చెప్పారు.
ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యం పెరగాలి..!
ఆర్యవైశ్యులకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదని సీఎం అన్నారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవనం పూర్తిస్థాయిలో ఉపయోగపడాలని.. భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. తాను మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులు కలిసి ఉంటేనే బలం ఉంటుందని.. ఒక్కతాటిపై నడిస్తేనే అందరూ గౌరవిస్తారని అన్నారు.
ఆర్యవైశ్యులకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చామని.. కొడంగల్లోని ఓ మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటా తీసుకోవాలని.. ఐక్యంగా ఉంటే అది సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యులకు ముందు చూపు, జాగ్రత్త అనేవి వారి డీఎన్ఏలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
[ CM Revanth Reddy, Revanth Reddy Speech, Arya Vysya, Arya Vysya Meeting, Telangana CM, Telangana Politics, Arya Vysya Community, Atma Gauravam Bhavan, Rosయ్య, Mahatma Gandhi, Potti Sriramulu, Congress Party, Arya Vysya Corporation, Kodangal, Telangana Government ]


