TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!

Published on: Tue Sep 15, 2026 6:25PM

విద్యార్థులను ఆందోళనలకు ఉసిగొల్పుతు.. రెచ్చగొడుతున్నా..కోచింగ్ కేంద్రాలు.!.

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వేదిక కాకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో  ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఒత్తిడి తెస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దురుద్దేశ పూర్వకంగా కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్టు అధికారులు వివరించారు.

 

 పోటీ పరీక్షలకు సిద్ధం చేయాల్సిన అభ్యర్ధులను రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే కొన్ని ప్రైవేటు కోచింగ్ సంస్థల యజమానులు దురుద్దేశంతో అభ్యర్ధులను నిరసనలకు, ఆందోళనల కోసం ప్రోత్సహించినట్టు తేలిందన్నారు. ఈ అంశాలపై దృష్టి సారించిన సీఎం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్ధులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

వివిధ పోటీ పరీక్షలకు అభ్యర్ధులను సిద్ధం చేయాల్సిన ఈ కోచింగ్ కేంద్రాలు  కొందరు అభ్యర్ధులను రాజకీయ పరమైన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.  ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు 2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నడచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్ధులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకూ లోను కాకుండా తమ భవిష్యత్తుపై, పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచనలు జారీ చేసింది. 

 

 

[ CM Chandrababu, Private Coaching Centers, AP Government, Student Protests, Coaching Center Regulations, Competitive Exam Aspirants, AP Goverment, YS Jagan, Telugu news, Telugu One ]