గ్రీజ్ లేదు కానీ.. మూడు రాజధానులా?

తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీస్తారా? ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62 మంది చనిపోయారు. వరదల్లో రూ.6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు?. జ్యుడీషియల్ ఎంక్వయిరీ అడిగితే ఎందుకు అంగీకరించలేదు?.. అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు.

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మొత్తం కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు కూడా మరమ్మతులు చేయించలేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు క్లోజ్ అవ్వలేదు.. నీరు వృధాగా పోయింది. ఈ సారి వరదలకు అదే గేట్ ఓపెన్ అవ్వలేదు.. గేట్ సమస్య అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్‌ల కోసమే నీటిని విడుదల చేయలేదు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అయిన జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హులు. ప్రాజెక్ట్ గేటుకు గ్రీజ్ వెయ్యలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా?.. అంటూ జ‌గ‌న్‌రెడ్డిపై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. 

‘వర్షాలు భారీగా పడి రెండుసార్లు వరదలొచ్చాయి. ప్రాజెక్టులన్నీ అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. మళ్లీ వరద వస్తుందని వాతావరణశాఖ ముందే హెచ్చరించింది. అయినా స్పందించకపోవడం వల్లే విపత్తు జరిగింది. విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

‘ఒక వ్యక్తి 9 మందిని ఎక్కించుకుని చాలావరకు కాపాడాడు. ఏడుగురిని కాపాడగలిగాడు.. శ్వాస ఆడక ఇద్దరు చనిపోయారు. వరదలతో పరిస్థితి సీరియస్‌గా ఉంటే చర్చించకుండా మాపై దాడి చేస్తారా..?. సీఎం జగన్ సొంత జిల్లాకు వెళ్లి ఏం చేశారు?. ఎవరూ మాట్లాడకుండా ముందే బాధితులను బెదిరించారు. ఎవరిని బయటకు రాకుండా.. బాదితులకంటే ఎక్కువ పోలీసులను పెట్టి ఓదార్పు చేస్తారా? తిరుపతి తుమ్మలగుంట చెరువును క్రికెట్‌ స్టేడియం చేశారు. దీంతో పద్మావతి వర్సిటీ నుంచి ఆటోనగర్‌ వరకు వరద వచ్చింది. రాయలచెరువు తెగి ఉంటే 35 గ్రామాల జలమయం అయ్యేవి. మామూలు వ్యక్తులతో రాయలచెరువుకు మరమ్మతులు చేయిస్తారా..?’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

పెన్నా నదిలో కరకట్టలకు ప్రమాదం జరిగేలా ఇసుక తవ్వకాలు జరిపారు. ఒక్క నెల్లూరులోనే రూ. 2 వేల కోట్ల నష్టం జరిగింది. ప్రాణాలకు రక్షణ కాదు.. డెడ్ బాడీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. రాష్ట్రంలో ఈ స్థాయి వరదలు ఉంటే సీఎం సిగ్గులేకుండా నాడు పెళ్లికి పోయాడు. వేరే ప్రభుత్వం అయితే ఇలాంటి ఘటనకు సిగ్గుతో తల వంచుకుంటారు. విశాఖ విషాదంలో బాధితులకు కోటి పరిహారం ఇచ్చారు.. ఇక్కడ బాధితులకు కోటి ఇవ్వాలి. జ్యుడీషియల్ విచారణ జరిపించాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.