చక్రి కుటుంబంలో కలహాలు...

 

రెండు రోజుల క్రితం గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కుటుంబంలో ఆస్తికోసం కలహాలు జరుగుతున్నాయి. చక్రి తరఫు బంధువులు, చక్రి భార్య శ్రావణికి మధ్య గొడవలు బయటపడ్డాయి. చక్రి కుటుంబ సభ్యులు ఆస్తి కోసం తనను వేధిస్తున్నారని చక్రి భార్య శ్రావణి హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త చనిపోయిన బాధలో తాను వుంటే, ఆయన బంధువులు తనను ఆస్తికోసం వేధిస్తున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రి చనిపోయి, ఆయన మృతదేహం ఇంట్లో వుండగానే ఆయన బంధువులు ఆస్తికోసం తనను వేధించడం ప్రారంభించారని ఆమె చెప్పారు. పదకొండు రోజుల కర్మకాండలన్నీ అయిపోయిన తర్వాత అన్ని విషయాలూ మాట్లాడుకుందామని తాను చెప్పినా వాళ్ళు వినకుండా తన మీద దష్ప్రచారం చేస్తున్నారని, చక్రిని తానే విషం పెట్టి చంపేశానని ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చక్రి కుటుంబ సభ్యులు ఏనాడో ఇల్లు వదిలి వెళ్ళిపోయారని ఆమె తెలిపారు. చక్రి ఆస్తిమీద హక్కు భార్యనైన తనకు కాకుండా వారికి ఎందుకు హక్కు వుంటుందని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో న్యాయం కోసం తాను హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని ఆశ్రయించానని ఆమె వెల్లడించారు.